అమెరికాలో కాల్పులు: నలుగురి మృతి, మరో 9 మందికి గాయాలు
అమెరికాలో ఆదివారం నాడు కాల్పులు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటన మరోసారి అమెరికాలో కలకలం రేపింది.
హైదరాబాద్: అమెరికాలోని కేన్సన్ సిటీలోని బార్లో ఆదివారం నాడు జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలోని కేన్సన్ సిటీలోని బార్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆదివారం నాడు తెల్లవారుజామున 1:30 గంటలకు చోటు చేసుకొంది. కేన్సన్ సిటీలోని కేసీ బార్లో ఈ ఘటన చోటు చేసుకొంది.
బార్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు బార్ నుండి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయమై విచారణ జరుపుతున్నారు. కేన్సన్ సిటీలో 2017 ఫిబ్రవరి 22న కూచిబొట్ల శ్రీనివాస్ను ప్యురింటన్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. తన స్నేహితుడు అలోక్ మాదసానితో కలిసి శ్రీనివాస్ బార్లో ఉన్న సమయంలో ప్యురింటన్ కాల్చి చంపాడు.
ఈ ఘటన ఆ సమయంలో అమెరికాలో సంచలనం కల్గించింది. అమెరికాతో పాటు ఇండియాలో కూడ ఈ ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇదే సిటీలో మరోసారి కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.
ఈ సిటీలో భవిష్యత్తులోఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆ రాష్ట్ర గవర్నర్ హఆమీ ఇచ్చారు. కానీ, రెండేళ్లు దాటగానే అదే తరహా ఘటన చోటు చేసుకొంది.