Asianet News TeluguAsianet News Telugu

దర్శకుల కోసం ప్రభాస్‌ భారీ విరాళం.. అంతేకాదు వాళ్ల కోసం గెస్ట్ గా?

ప్రభాస్‌ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు. దర్శకుల సంక్షేమం కోసం ఆయన భారీ విరాళాన్ని అందించారు. 
 

prabhas is a huge contribution to the directors community arj
Author
First Published Apr 23, 2024, 10:06 AM IST

డార్లింగ్‌ ప్రభాస్‌.. సేవ విషయంలో ఆయన మనసు చాలా పెద్దది. తోటి ఆర్టిస్టులకు పసందైన విందుతో కడుపునింపడమే కాదు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ ఆయన ముందే ఉంటారు. రాష్ట్రంలో, దేశంలో ఏ విపత్తు వచ్చినా, సినిమాసెలబ్రిటీలు చేసే సాయంలో ఆయనదే పెద్ద చేయి. కోవిడ్‌ సమయంలోనూ కోట్లల్లో విరాళం ఇచ్చారు. చెన్నై ఫ్లడ్‌ సమయంలోనూ ఆయన తన వంతు సాయాన్ని అందించారు. ఇప్పుడు మన తెలుగు దర్శకుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. 

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఆయన ఏకంగా రూ. 35లక్షల విరాళం ప్రకటించడం విశేషం. దర్శకుల సంఘం సంక్షేమ నిధికి ఆయన ఈ మొత్తాన్ని విరాళంగా అందిస్తున్నట్టు దర్శకుడు మారుతి వెల్లడించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో డైరెక్టర్‌ అసోసియేషన్‌ కర్టెన్‌ రైజర్‌ మీటింగ్‌ జరిగింది. మే 4న దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దానికోసం పెద్ద ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగా కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి ఈ విషయాన్ని తెలియజేశారు. 

తాను ఈవెంట్‌కి వస్తోన్న సమయంలో ప్రభాస్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని, ఆయన 35లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు వెల్లడించారని తెలిపారు మారుతి. ఈ సందర్భంగా దర్శకుల సంఘం ఆయనకు ధన్యవాదాలు తెలియజేసింది. అంతేకాదు చాలా మంది స్టార్స్ స్పందిస్తూ విరాళాలు అందిస్తున్నారని, దర్శకుల బాగు కోసం వాళ్లు ముందుకు రావడం ఆనందంగా ఉందని మారుతి చెప్పారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే మే 4న డైరెక్టర్స్ డేని నిర్వహించుకుంటుంది తెలుగు దర్శకుల సంఘం. ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. దీనికి చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు. నాని, నితిన్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, అల్లరి నరేష్ తోపాటు మెగాస్టార్‌ చిరంజీవిని కూడా ఆహ్వానించారు. అయితే ఇందులో ప్రభాస్‌ పేరు కూడా వినిపిస్తుంది. ప్రభాస్‌ మెయిన్‌ గెస్ట్ గా రాబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిస్తున్నాయి. కానీ అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్ గా వచ్చినప్పుడు మిగిలిన పెద్ద హీరోలు గెస్ట్ గా అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ రావడం కష్టమే అనే టాక్‌ కూడా ఉంది. దీనిపై మున్ముందు మరింత క్లారిటీ రానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios