Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ ను వెళ్లగొట్టారు, అమరావతిని చంపేశారు: జగన్ పై బాబు ఫైర్

రిలయన్స్ ను వెళ్లగొట్టారని, అమరావతిని చంపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. ఇటువంటి సిఎంను చూడలేదని చంద్రబాబు వైఎస్ జగన్ మీద మండిపడ్డారు.

Chandrababu makes verbal attack on YS Jagan taking Amaravati and Reliance
Author
Chittoor, First Published Nov 7, 2019, 10:49 AM IST

చిత్తూరు: ఛలో ఆత్మకూరుకు వెళ్తుంటే నా ఇంటి గేట్లకు తాళ్లు కట్టారు. ఈ తాళ్లే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లని అప్పుడే హెచ్చరించానని, తాను అడిగాననే అక్కసుతోనే ప్రజావేదికను కూల్చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి పర్యటనలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. 

కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన అన్నారు. "ప్రతిచోటా పులివెందుల పంచాయితీలు చేస్తున్నారు.ఇలాగే చేస్తే పులివెందుల పంపడం మిమ్మల్ని ఖాయం. తొలి 6నెలల్లనే మంచి సీఎం అనిపించుకుంటా అనిచెప్పి 5నెలల్లోనే ఇంతకంటే చెత్త సీఎం ఉండడనే పేరు తెచ్చుకున్నారు" అని అన్నారు.

"గతంలో చేసిన సీఎంలకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు వచ్చాయా..? ప్రజలకు సేవలు చేసే సీఎంలనే ఇప్పటిదాకా చూశాం. ప్రజలను బాధలు పెట్టే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. ప్రత్యర్ధి పార్టీలను అంతం చేయాలనే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం" అని ఆయన అన్నారు..‘‘తవ్వండి తవ్వండి’’ అని అధికారులను ఉసిగొల్పారని చంద్రబాబు అన్నారు. 

"సన్మానాలు చేస్తాం అన్నారు. ఏం తవ్వారు ఈ 5నెలలు..? కొండను తవ్వి ఏం పట్టారు..? వెంట్రుక కూడా పట్టుకోలేక పోయారు. నీతి నిజాయితీతో సేవాభావంతో పనిచేశాం. 
తండ్రి అధికారం అండతో రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు తానే సిఎం అయ్యాక మరింత రెచ్చిపోయి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశారా..?" అని చంద్రబాబు అన్నారు, 

Also Read: తల పగులగొడుతారా: పోలీసులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

"ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మారితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఇప్పుడే చూశాం. 11మంది సీఎంల పాలనలో ఇన్ని ఇబ్బందులు ఎవరూ పడలేదు. జగన్ సీఎం అయ్యాకే అన్నివర్గాల ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.టిడిపి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంతో అందరికీ అందుబాటులో ఉంచింది. భారీఎత్తున నిర్మాణాలను ప్రోత్సహించింది" అని విమర్శించారు. 

"పెద్దఎత్తున ఉపాధి అందరికీ లభించింది. మా వాగులో ఇసుక మేము తెచ్చుకోకూడదా, మా పొలంలో మట్టి మేము తెచ్చుకోరాదా అని జనమే నిగ్గదీస్తున్నారు.వరదల్లో ఇసుక నిల్వలు కొట్టుకుపోయాయని చెప్పిన మంత్రికి సన్మానం చేయాలి. కాలం చెల్లి కార్మికులు చనిపోతున్నారన్న మంత్రికి ఏ సన్మానం చేయాలి..?" అని అన్నారు. 

"ఉరి వేసుకోవడం, బిల్డింగ్ నుంచి దూకడం, పురుగుమందు తాగడం కాలం చెల్లి చనిపోవడమా..? మంత్రి వల్లే చనిపోతున్నామని సూసైడ్ నోట్ లో రాసి చనిపోవాల్నా..?
పంచాయితీ రాజ్ కాంట్రాక్టర్ కు పంచాయితీరాజ్ మంత్రి ఇస్తారు. కాలేజీలు ఉన్నాయనకి విద్యాశాఖా మంత్రి చేస్తారు. దొంగల చేతికే తాళం ఇచ్చి వాళ్ల పని సులభం చేశారు.రెండువారాల్లో 36మందిపైగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు" అన్నారు. 

"సీఎం ఒక్క సమీక్ష చేసిన దాఖలాలు లేవు. రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తే, మన రాష్ట్రంలో సీఎం వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా ఏం బాధలేదు ఈ సీఎంకు..దసరా దీపావళి పండుగలే లేకుండా 35లక్షలమంది కార్మికులు ప్రతిరోజూ పస్తులు..అన్నమో రామచంద్రా అని లక్షలాది కార్మికుల గోడు ఈ సీఎంకు పట్టదు. ఈయన ఒక్కడే ఆనందంగా ఉండాలి" అని చంద్రబాబు అన్నారు, 

Read Also: జగన్ ప్రభుత్వానికి షాక్: రిలయన్స్ ఫ్లాంట్ వెనక్కి.

"ఇంకెవరూ ఆనందంగా ఉండకూడదు రాష్ట్రంలో..మరో ఆలోచన లేకుండా టిడిపి ఉచిత ఇసుక పాలసీ అమలు చేయండి, ఆత్మహత్యలు ఉంటే అప్పుడు అడగండి.ఈ ప్రభుత్వ హత్యలకు వైసిపి నేతలే కారణం..మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేలు ఆర్ధికసాయం అందించాలి.
 దోమలపై యుద్దం చేశానని అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు" అని అన్నారు. 

"కరెంట్ లేకుండా చేసి, దోమలను పెంచి జనం మీదకు వదిలారు. ప్రతి ఇంట్లో డెంగీ,మలేరియా,టైఫాయిడ్,విష జ్వరాలే..భార్య డెంగీతో చనిపోయిందన్న ఆవేదనతో పసిబిడ్డతో సహా మండపేటలో ఆత్మహత్యకు పాల్పడటం, పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఈ జిల్లా చంద్రకళ డెంగీతో మృతి చెందడం, ఈ రోజు తిరుపతిలో 9ఏళ్ల బాలిక చనిపోవడం,మదనపల్లిలో 4వ తరగతి బాలుడు చనిపోవడం...ఇవేమీ ఈ సీఎం కు పట్టవు" అని చంద్రబాబు అన్నారు.

"ఈ 5నెలల్లో ఒక్క తట్టమట్టి తీయలేదు, ఒక యూనిట్ కాంక్రీట్ వేయలేదు. అన్నిపనులను ఆపేశారు. రివర్స్ పాలన తెచ్చారు.టిడిపి 5ఏళ్లలో హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేశాం, కుప్పం శివారు వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లాం. అనేక ప్రాజెక్టులు పూర్తిచేసి టిడిపి పాలనలో చెరువులన్నీ నింపాం" అని అన్నారు. 

"పంపులు రడీగా ఉన్నాయి, కాలువలన్నీ సిద్దం చేశాం.కానీ నీళ్లు ఎందుకు తేలేక పోయారు..?తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి నీళ్లు శ్రీశైలానికి నడిపే ప్రణాళిక సిద్దం చేశారు. జనం మూకమ్మడిగా వ్యతిరేకించడంతో మళ్లీ టిడిపి ప్రణాళికనే బనకచర్ల రెగ్యులేటర్ మీదుగా నడిపే ప్లాన్ బైటకు తీశారు.గోదావరి వరదల్లో ఇజ్రాయిల్, కృష్ణా వరదల్లో అమెరికా వెళ్లారు" అని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. 

"ప్రజలను విపత్తుల్లో ముంచి ఆయన విదేశాలకు పోయారు.ఇప్పుడు 570టిఎంసిలు సముద్రంలోకి పోయాయి. గోదావరిలో 4వేల టిఎంసిలు వృధాగా పోయాయి. నీళ్లన్నీ సముద్రంలోకి పోయాక చెరువులు నింపలేదేమిటని ఈ సిఎం అడుగుతున్నాడు..నా ఇల్లు ముంచడంపై ఆయనకు ఉన్న తాపత్రయం చెరువులు నింపడంపై లేదు. టిడిపి తవ్విన కాలువల వల్లే ఈ రోజు రాష్ట్రం సస్యశ్యామలం అయ్యింది" అని చంద్రబాబు అన్నారు. 

"పొరుగు రాష్ట్రాలు వరదల్లో మునిగి, జలాశయాలకు నీళ్లు వస్తే తమ ఘనతే అనడం హాస్యాస్పదం. రివర్స్ టెండర్ పేరుతో లాలూచీ పడి టెండర్ రిజర్వ్ చేశారు. అప్పుడు తండ్రిని అడ్డుపెట్టుకుని దోచేశాడు, ఇప్పుడు అతనే నేరుగా దోపిడికి పాల్పడుతున్నారు.విభజన కష్టాల్లో డబ్బుల్లేక పోయినా, ఒకేసారి రూ.50వేలు రైతుకు టిడిపి ప్రభుత్వం ఇచ్చింది రుణమాఫీ కింద. కానీ భరోసా కింద 3విడతల్లో రూ.7,500ఇస్తారట" అని అన్నారు. 

"పించన్ రూ.1000 నాలుగేళ్లు, 4విడతలుగా ఇస్తారట. ఈయన భరోసాపై నమ్మకం లేకే 300రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.టిడిపి పాలనలో వరుసగా 4ఏళ్లు సగటున 11%వృద్ది సాధించాం. ఆదాయం పెంచాం, సంక్షేమం అందించాం. రూ.32వేల కోట్ల నరేగా నిధులు సద్వినియోగం చేసుకున్నాం. 22శాఖలను కన్వర్జెన్స్ చేసి 25వేల కిమీ సిమెంట్ రోడ్లు వేశాం, 6వేల అంగన్ వాడి భవనాలు నిర్మించాం, 2500పంచాయితీ భవనాలు కట్టాం. వాటన్నింటికీ ఇప్పుడు వైసిపి రంగులు వేస్తున్నారు. చివరికి జాతీయ జెండా రంగులు తుడిపేసి, వైసిపి రంగులేస్తారా..?" అని అన్నారు. 

"మీ ముఖాలకు వైసిపి రంగులేస్తే దొంగలని గుర్తించి జనం దూరం జరుగుతారు.అబ్దుల్ కలామ్ పేరు కూడా తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు ప్రతిభ అవార్డులకు..జనం ఛీకొట్టేసరికి మళ్లీ పేరు మార్చారు. పిచ్చితుగ్లక్ మాదిరి చేస్తున్నారు.అమరావతిని జాగ్రత్తగా చేసివుంటే రూ.లక్ష కోట్ల ఆస్తిగా ఉండేది. భవిష్యత్తులో రూ.2లక్షల కోట్ల సంపద అయ్యేది" అని అన్నారు. 

"9ఏళ్ల టిడిపి పాలనలో చేసిన అభివృద్ది వల్లే హైదరాబాద్ సంపన్న నగరం అయ్యింది. అప్పుడేసిన చిన్న పునాదులే ఇప్పటి హైదరాబాద్ ఎదుగుదలకు మూలాలు అయ్యాయి. అవుటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్, ఐఎస్ బి, ఫ్లై వోవర్లు ఎన్నో పనులు చేశాం. రాజశేఖర రెడ్డి, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి ఆ అభివృద్దిని కొనసాగించారు. 
కానీ జగన్మోహన్ రెడ్డికి బంగారు బాతులాంటి అమరావతిని అప్పగిస్తే చంపేశారు" అన్నారు. 

"దొంగలెక్కలు రాసి అడ్డంగా దొరికిపోవడమే మీకు తెలుసు, సమాజంలో సంపద పెంచడం మీకు చేతకాదు.మద్యనిషేధం అనిచెప్పి పోలీసులతో మద్యం అమ్మిస్తారా..? ప్రభుత్వ మద్యం దుకాణాలు పెడతారా..? రాత్రి 8గం కు ఇవి మూతేసి వైసిపి కార్యకర్తలు ఇంటింటికి బెల్ట్ షాపులు అర్ధరాత్రిదాకా తెరుస్తారు..జె ట్యాక్స్ దండుకోడానికే మద్యం ధరలను పెంచేశారు" చంద్రబాబు అన్నారు. 

"కమిషన్లు ఇచ్చే బ్రాండ్లనే అమ్ముతున్నారు.సారాబట్టీలు ప్రతిచోటా మళ్లీ బయల్దేరాయి. రేపో ఎల్లుండో ఇక సారా మృతుల వార్తలు వస్తాయి.సిమెంట్ కంపెనీల నుంచి ముడుపుల కోసమే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారు. వాటాలిచ్చే కంపెనీల్నే వ్యాపారాలు  చేసుకోనిస్తున్నారు. ఇవ్వనివాళ్లను బెదిరించి తరిమేస్తారు. ఒక సీఎంకు చెడు  ఆలోచనలు ఉంటే రాష్ట్రానికి ఎంత చెడు జరుగుతుందో జగన్ పాలనే నిదర్శనం" అని అన్నారు.

"చిత్తూరు జిల్లాకు టిడిపి 5ఏళ్లలో ఎన్నో పరిశ్రమలు తెచ్చాం. మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా చేశాం. ప్రతి 10ఫోన్లలో 3ఫోన్లు ఇక్కడే తయారీ. ఫాక్స్ కాన్, సెల్కాన్ అనేక పరిశ్రమలు తెచ్చాం. ఒకప్పుడు అమర్ రాజా ఒక్క పరిశ్రమే ఉండేది. అలాంటిది చిత్తూరులో భారీగా పెట్టుబడులు రాబట్టాం. ఇప్పుడన్నింటినీ బెదిరించి తరిమేస్తున్నారు" అని అన్నారు.

"రూ.15వేల కోట్ల రిలయన్స్ ను వెళ్లగొట్టారు. రూ.25వేల కోట్ల పేపర్ పరిశ్రమలను ప్రకాశం జిల్లానుంచి తరిమేశారు. రూ.70వేల కోట్ల అదాని డేటా సెంటర్ విశాఖలో కుదించేశారు. టిసిఎల్ ను కూడా వెళ్లగొట్టారు, అరవిందో టెక్స్ టైల్స్ ను తరిమేశారు.నీళ్లు లేకుండా ఎలా పెడ్తామని కియా వాళ్లు అంటే పట్టుదలతో 4నెలల్లో గండికోటకు నీళ్లు తెచ్చి అనంతపురంలో కియా ఏర్పాటు చేయించాం. వీళ్ల చేతకానితనం వల్లే రిలయన్స్,టిసిఎల్ వెనక్కిపోయాయి" అని చంద్రబాబు అన్నారు.

"పొరుగు రాష్ట్రాలకు నా రాష్ట్రం బిడ్డలు ఉద్యోగాలకు వెళ్లకూడదనే సంకల్పంతో ఇక్కడే ఉద్యోగ అవకాశాల కోసం భారీగా పారిశ్రామికీకరణకు నడుం కట్టాను. రూ.16లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంవోయూలు చేసుకున్నాం. అన్నింటినీ పోగొడుతున్నారు.సింగపూర్ ను రాజధాని నుంచి వెళ్లగొట్టి ఆనందిస్తున్నారు.చెడ్డవ్యక్తి, చేతగానివాడు, స్వార్ధపరుడు అధికారంలోకి వస్తే ఏ స్థితికి రాష్ట్రం వస్తుందో  జగన్ పాలనే ప్రత్యక్ష రుజువు" అని అన్నారు.

"ఈ జిల్లాలో ఎన్నో అభివృద్ది పనులు చేపట్టి, నీళ్లు తెచ్చి,పరిశ్రమలు తెస్తే ఒక్కసీటే గెలిపించడం బాధేస్తోంది.టిడిపి ప్రభుత్వం పించన్ రూ.200నుంచి రూ.2వేలకు పెంచితే, వైసిపి ఇప్పుడు రూ.250మాత్రమే పెంచింది. అదే టిడిపి అధికారంలోకి వచ్చివుంటే, మరో రూ.1000 పెంచి, ప్రతినెలా రూ.3వేలు ఇచ్చేవాళ్లం. 45ఏళ్లకే మహిళలకు పించన్ ఇస్తానని మహిళను మోసం చేశారు. నవగ్రహాలు పట్టాయి రాష్ట్రాన్ని, నవరత్నాలు ఇవ్వలేదుకాని..అమ్మవడిలో అన్నీ ఆంక్షలే..మొదట ఎందరు బిడ్డలు ఉన్నా ఇస్తామని అన్నారు, ఇప్పుడు ఒక్కబిడ్డకే అన్నారు, అదికూడా 75%హాజరుంటేనే ఇస్తాం అన్నారు" అని చంద్రబాబు అన్నారు. 

"చింతమనేని ప్రభాకర్ పై ఈ రోజు కూడా 4కేసులు పెట్టారు. ఈ 5నెలల్లోనే అతనిపై 25పైగా కేసులు పెట్టారు. ఎస్సీ,ఎస్టీ అక్రమ కేసులకు, సోషల్ మీడియా కేసులకు, తప్పుడు కేసులకు భయపడేది లేదు. అక్రమ కేసులు పెడితే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు.టిడిపి పని అయిపోయిందన్న పార్టీల పనే అయిపోయింది. ఈ పార్టీ జోలికి వచ్చేవాళ్లే మసి అయిపోతారు" అని చంద్రబాబు అన్నారు. 

"ఎన్టీఆర్ పెట్టిన ముహూర్త బలం అలాంటిది.టిడిపిని శక్తివంతమైన పార్టీగా చేసే బాధ్యత నాది. సమర్ధవంతమైన నాయకత్వాన్ని పెంచే బాధ్యత నాది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచే బాధ్యత మీదే..పోరాడే శక్తి, ధీటుగా ఎదుర్కొని నిలబడే శక్తి యువతదే..మీ భవిష్యత్తు అంధకారం చేసే హక్కు వైసిపి నేతలకు లేదు. వైసిపి వల్ల రాష్ట్రానికి నష్టం కలగకుండా యువతే కాపాడుకోవాలి" అని అన్నారు.

"సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. నాకింకేం కోరికలు ఉంటాయి. 14ఏళ్లు సిఎంగా చేశాను, 11ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాను, 25ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఎంపికలో కీలక భూమిక నాదేనన్న సంతృప్తి ఉంది. నేను చేసిన అభివృద్ధి పనుల వల్లే హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటి గా మారిందన్న తృప్తి ఉంది. అదే స్ఫూర్తితో అమరావతిలో అనేక అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టాం" అని చంద్రబాబు అన్నారు. 

"వాటిని నిలిపేసి రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారు అనేదే నా బాధ..టెండర్లు వేయమని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం చూసైనా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.  నరేగా పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి. పంచాయితీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా అందరూ పాల్గొనాలి.కార్మికుల ఆత్మహత్యలు చూడలేక, వారికి సంఘీభావంగా ఈనెల 14న 12గంటల దీక్ష చేస్తున్నాం" అని చంద్రబాబు అన్నారు. 

"ఎవరూ ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతం కావాలి. మళ్లీ జిల్లాలో 14సీట్లలోనూ తెలుగుదేశం పార్టీ గెలుపే మనందరి లక్ష్యం కావాలి.  పార్టీని ప్రజలకు చేరువ చేయాలి. వైసిపి అణిచివేత చర్యలపై గట్టిగా పోరాడదాం" అని చంద్రబాబు చెప్పారు

Follow Us:
Download App:
  • android
  • ios