Asianet News TeluguAsianet News Telugu

పూర్తిస్థాయిలో రైల్వేల ప్రైవేటీకరణకు నాంది... కొత్తగా 150 ప్రైవేట్ రైళ్లు

రైల్వేలను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణకు నాంది ప్రస్తావన మొదలైంది. 150 రూట్లలో ప్రత్యేకించి పర్యాటక మార్గాల్లో ‘తేజస్’ వంటి ప్రైవేట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే రెండు తేజస్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా వారణాసి- ఇండోర్ మధ్య ముచ్చటగా మూడో తేజస్ రైలు త్వరలో ప్రారంభం కానున్నది.

Railway Budget 2020: More Tejas-type trains for connecting tourist places
Author
New Delhi, First Published Feb 2, 2020, 6:21 PM IST

భారతీయ రైల్వేల ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా 150 ప్రైవేట్ రైళ్లు నడుపుతామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేట్ ‘తేజస్’ రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే.

దేశంలోని పర్యాటక ప్రాంతాలకు కొత్తగా తేజస్‌ వంటి రైళ్లను నడుపుతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఢిల్లీ-ముంబై మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆ సమయంలోనే చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27వేల కి.మీ రైలు మార్గాన్ని విద్యుదీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.  బెంగళూరు సబర్బన్‌ ప్రాజెక్టుకు 20 శాతం ఈక్విటీని ఇస్తామని చెప్పారు. ఆ మొత్తం రూ.18,600 కోట్లు కానుంది. 

Also Read:స్టాక్స్‌ను మెప్పించని నిర్మలమ్మ.. రూ.3.46 లక్షల కోట్లు ఆవిరి

త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకుగాను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఒక ‘కిసాన్‌ రైలు’ను నడుపుతామని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్త మార్గాలకు రూ. 12వేల కోట్లు రైల్వేశాఖకు రూ.70 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం పెట్టుబడి వ్యయ ప్రణాళికను రూ. 1.61 లక్షల కోట్లుగా పేర్కొంది.

బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. 2020-21లో ప్రయాణికులు, సరుకు రవాణా, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని 9.5 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి రూ.12వేల కోట్లు, గేజ్‌ మార్పిడి పనులకు రూ.2,250 కోట్లు, డబ్లింగ్‌ పనులకు రూ.700 కోట్లు కేటాయించారు.

రైల్వేల్లో సరుకు రవాణాకు రూ.5,786.97, సిగ్నల్స్‌  టెలికాం వ్యవస్థకు 1,650 కోట్లు నిర్దేశించారు. ప్రయాణికులకు వసతులకు రూ.2,725.63 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల చార్జీల ద్వారా రూ.61వేల కోట్లు, సరుకు రవాణా ద్వారా రూ.1.47లక్షల కోట్లు రాగలవని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మార్గాల ద్వారా రైల్వే శాఖ రూ.2,25,613 కోట్లను ఆర్జించగలదని అంచనా వేశారు. వేతనాల రూపంలో రూ.92,993.07 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 

రైల్వేశాఖ ఆర్థికంగా కుదేలవుతున్న నేపథ్యం లో ప్రభుత్వం దానికి ఉద్దీపన ప్యాకేజీని అందజేస్తుందన్న ఆశలు ఆ శాఖ ఉద్యోగుల్లో నీరుగారిపోయాయి. కేటాయింపులను బట్టిచూస్తే.. 2020-21లో ఆ శాఖ రూపాయి సంపాదించడానికి 96.2 పైసలను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆపరేటింగ్‌ నిష్పత్తి (ఓఆర్‌)ను ప్రభుత్వం 96.2గా నిర్దేశించింది.

‘ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం స్థిరంగా ఉండగా, సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైల్వేకు ఉద్దీపన ప్యాకేజీ ఇస్తుందని ఆశించాం. కానీ ప్రభుత్వ బడ్జెట్‌ నిరుత్సాహ పరిచింది’ అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు సుబోధ్‌ జైన్‌ పేర్కొన్నారు. 

ఈ బడ్జెట్‌లో రైల్వే శాఖకు గానీ, రైల్వే ఉద్యోగులకు గానీ ఏమీ లేదని ఆల్‌ ఇండియా రైల్వే మెన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ్‌గోపాల్‌ మిశ్రా విమర్శించారు. 150 మార్గాల్లో 100 రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ రంగానికి అనుమతిస్తామని మంత్రి గత ఏడాది కూడా చెప్పారు. 

Also Read:జనాభా ప్రాతిపదికన పన్ను వాటా: తెలంగాణ సహా దక్షిణ రాష్ట్రాలకు షాక్

పలు మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిచిన నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ త్వరలోనే తమ మూడో రైలును ఇండోర్‌, వారణాసి మధ్య నడుపనుంది. ఈ విషయాన్ని రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ శనివారం వెల్లడించారు. 

హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని సదుపాయాలనే ఐఆర్సీటీసీ కూడా కల్పిస్తుందని రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ చెప్పారు. ఐఆర్సీటీసీ ఇప్పటికే ఢిల్లీ - లక్నో, ముంబై  అహ్మదబాద్‌ మధ్య రైళ్లను నడుపుతున్నది. ఇండోర్‌- వారణాసి మధ్య ఈనెల 20 నుంచి రైలు ప్రారంభం కావచ్చని భావిస్తున్నామనియాదవ్‌ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios