Budget 2020: ఆరేళ్లలో బడ్జెట్‌లో సమూల మార్పులు: ఫిబ్రవరి ఒకటో తేదీకి చేంజ్

By Sandra Ashok KumarFirst Published Jan 27, 2020, 2:32 PM IST
Highlights

కేంద్రంలో నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తర్వాత గత ఆరేళ్లలో పలు మార్పులు జరిగాయి. ప్రత్యేకించి బడ్జెట్ సమర్పణ పాలసీలోనూ సమూల మార్పులు తెచ్చారు. ఆదాయం పన్ను శ్లాబ్‌ల్లో చాలా సవరణలు చేశారు. బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఒకటో తేదీకి తీసుకొచ్చారు. బ్రిటిష్ కాలం నాటి సూట్ కేసు సంస్క్రుతికి తెర దించి ఎర్రని బట్ట సంచిలో బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పించారు.

న్యూఢిల్లీ‌: అధికారం చేపట్టిన ఆరు సంవత్సరాల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ బడ్జెట్‌లో చాలా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఎంతోమందిపై నేరుగా ప్రభావం చూపే ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుల విధానంలో సవరణలు చేసింది. మరోపక్క బడ్జెట్‌ తేదీని కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చేసింది. బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న ‘బడ్జెట్‌ సూట్‌కేసు’ సంప్రదాయానికి తెర దించి ఎర్రటి బట్ట సంచితో బడ్జెట్‌ పత్రాలను తెచ్చే సంప్రదాయం మొదలుపెట్టింది.  

2014లో కేంద్రంలో మోదీ సర్కార్ తొలిసారి అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బడ్జెట్‌లో ఆయన ఆదాయం పన్ను మినహాయింపు పరిధిని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు పెంచారు. 2014లో సీనియర్‌ సిటిజన్లకు మినహాయింపును రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షలకు చేరుస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు.

also read Budget 2020:కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలేయండి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ఇక 80ఏళ్లు దాటిన వారికి రూ.5లక్షలు చేశారు. సెక్షన్‌ 8సీ పరిధిని రూ.లక్ష నుంచి రూ.1.5లక్షలకు పెంచగా.. గృహ రుణాల వడ్డీపై పన్ను మినహాయింపును రూ.1.5లక్షల నుంచి రూ. 2లక్షలకు చేర్చారు. 2015లో నాటి విత్త జైట్లీ తన రెండో బడ్జెట్‌లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లలేదు. కేవలం ఆరోగ్య బీమాపై డిడక్షన్‌ను రూ.15 వేల నుంచి రూ.25వేలకు పెంచారు. 

ఇక సీనియర్‌ సిటిజన్లకు ఇది రూ.20 వేల నుంచి రూ.30వేలకు చేర్చారు. దీంతోపాటు ఎన్డీఏ ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు అలెవెన్స్‌పై మినహాయింపును కూడా రూ.800 నుంచి రూ.1,600కు చేర్చింది. రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న వారిపై సర్‌ఛార్జిని 10శాతం నుంచి 12 శాతానికి చేర్చారు.

ఈ బడ్జెట్‌లో సంపద పన్ను తొలగించి రెండు శాతం సర్‌ఛార్జిని విధించారు. అత్యంత సంపన్నుల పన్ను ఆదాయం రూ.కోటి దాటితే దీనిని విధించేలా  నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్‌లో సెక్షన్ ‌87 ఏ కింద పన్ను రిబేట్‌ రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ ఆర్థిక మంత్రి జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆదాయం రూ.5లక్షలు మించని వారికే వర్తిస్తుందనే నిబంధన పెట్టారు. 

ఆదాయం పన్ను (ఐటీ) చట్టం సెక్షన్‌ 80జీజీ కింద చెల్లించే ఆద్దెను రూ.24వేల నుంచి రూ.60 వేలకు పెంచారు. రూ. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్‌ఛార్జిని 15శాతం నుంచి 12శాతానికి తగ్గించారు. దీంతోపాటు రూ.10లక్షలు దాటిన డివిడెండ్లపై 10శాతం ఆదాయం పన్ను వేశారు. 

2017లో ఈ బడ్జెట్‌లో ఆదాయం ఉన్న రూ. 2.5లక్షల నుంచి రూ.5లక్షల మధ్యలో ఉన్నవారికి పన్నును 10శాతం నుంచి 5శాతం చేశారు. దీంతో వారికి రూ.12,500 వరకు లబ్ధి చేకూరింది. ఐటీ చట్టం సెక్షన్‌ 87ఏ కింద పన్ను రిబేట్‌ను కూడా 5,000 నుంచి రూ.2,500 చేశారు. వార్షికాదాయం రూ.3.5లక్షల వరకు ఉన్నవారికి ఇది వర్తిస్తుందన్నారు. దీంతోపాటు వార్షికాదాయం రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్నవారిపై 10శాతం సర్‌ఛార్జిని విధించడం మొదలుపెట్టారు. 

also read Budget 2020: బడ్జెట్‌లో ఆదాయ పన్నులో కోతలు...నిపుణులు అంచనా

2018లో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ల స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిధిని రూ.40వేలకు పెంచడంతో సామాన్యూడికి రూ.5,800 వరకు ప్రయోజనం సమకూరింది. అదే సమయంలో సీనియర్‌ సిటిజన్లకు ఆరోగ్య ఖర్చుల మినహాయింపును రూ.30వేల నుంచి రూ.50వేలకు చేర్చారు.

మరోపక్క బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపులపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపును రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క అప్పటికే ఆదాయం పన్ను, కార్పొరేట్‌ పన్నుపై ఉన్న 3శాతం విద్యాసెస్ స్థానంలో నాలుగు శాతం విద్య,ఆరోగ్య సెస్సును విధించారు. రూ.లక్ష విలువ దాటిన దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధించారు. 

2019లో కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మధ్యతరగతి వారిపై రూ.5లక్షల వరకు ఆదాయం పన్నుపై రిబేట్‌ ప్రకటించారు. 2019లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం రెండో విడత బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దీనిలో ఆదాయం పన్ను శ్లాబ్‌లపై ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.
 

click me!