బతకమ్మ కరుణిస్తే డిజిపి కావచ్చు...
పోలీసు హెడ్ క్వార్టర్స్ లో బతుకమ్మ వేడుకలు
డిజిపి రేసులో ఉన్న వాళ్లంతా సంబురాల్లో కనిపించారు
ఏదైనా సరే,అది పండగ కావచ్చు,పబ్బమూ కావచ్చు,ప్రజల్లో ఉన్నంతవరకే కల్చరల్ వ్యవహారంగా ఉంటుంది. నిజమయిన పండగ లాగా ఉంటుంది. స్టేట్ వ్యవహారంగా గుర్తింపు వస్తే అపుడది స్టేట్ అఫైర్ అవుతుంది, స్టేట్ అపైర్ అయినపుడు పొలిటికల్ ఆఫైర్ అవుతుంది. రాజకీయాలొస్తాయి. ఇంతవరకు ప్రజల గుండె ల్లో గూడుకట్టుకుని ఉన్న బతుకమ్మ ఇపుడు స్టేట్ అఫైర్ అయింది. అయ్యాక ఏంజరుగుతున్నదో అంతా చూస్తూనే ఉన్నాం. ఇపుడు మరొక కోణం చూద్దాం.
రాష్ట్రంలో బతుకమ్మ పోటీ మొదలయినట్లుంది. బతుకమ్మను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గానిర్వహించడం, స్వయంగా ముఖ్యమంత్రికూతురు,నిజాంబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉండటం, దానికి తోడు కోటి చీరెల పంపకంతో ప్రభుత్వం యావత్తు బతుకమ్మ పండగలో తలమునకలై ఉండటంతో, ప్రభుత్వశాఖాధిపతులమ ధ్య, మంత్రుల మధ్య బతకమ్మ పోటీ మొదలయింది. రంగరంగ వైభవంగా బతుకమ్మను నిర్వహించేందుకు అంతా పరుగులు తీసుకున్నారు. హైదరాబాద్ లో పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ప్రధాన కార్యాలయం ఆవరణలో గురువారం బతుకుమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వీటికి ‘సురక్ష బతుకమ్మ’ అని పేరు పెట్టారు. ఈ వేడుకలను తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పాటలను ‘సురక్ష బతుకమ్మ’ ఆడియో,సిడీలను ఆయన ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ప్రభుత్వ పరంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం, ప్రోత్సహించడం పెద్ద ఎత్తున జరగాలన్నారు. పోలీసు ప్రధాన కార్యలాయానికి బతుకమ్మ రావడం సంతోషమన్నారు. డిజిపి రేసులో ఉన్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, నగర కమిషనర్ మహేందర్రెడ్డి కూడా పాల్గొన్నారు. అనురాగ్ శర్మనవంబర్ నెలలో రిైటర్ అవుతున్నారు. పోటీలో తేజ్ దీప్ కౌర్ (1986)సుదీప్ లక్టాకియా, డాక్టర్ ఈస్ కుమార్, రాజీవ్ త్రివేది, మహేంద్ రెడ్డి , కృష్ణ ప్రసాద్ లు ఉన్నారు. ఇందులో కొందరు కేంద్రంలో ఉన్నవారు.
మరొక విశేషమేమిటంటే, డిజిపి రేసులో ఉన్న మరొక సీనియర్ ఐఫిఎస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ కూడా బతుకమ్మ నిర్వహించారు. ఆయన ఇంకా వినూత్న పద్ధతిలో బతుకమ్మ నిర్వహించి పై వారి కంట పడ్డారు. తొలిసారిగా లేజర్ షో బతుకమ్మ ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రోడ్ సేఫ్టీ, రైల్వే డిజిపి అయిన కృష్ణ ప్రసాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లలో బతుకమ్మ లేజర్ షోను ప్రారంభించారు. శాంతి సౌభాగ్యాలను ప్రేమానురాగాలను పంచుతూ ప్రజలంతా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
బతుకమ్మ పండుగను అన్ని ప్రధాన రోడ్ల కూడళ్లలో, దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వచ్చి పోయే సికిందరాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇక పోతే, రాష్ట్రమంత్రులంతా ‘బతుకమ్మ’ సంబురాలలో బిజిబిజి అయ్యారు. ఈ సంబురాలకు మంత్రులు జిల్లాలకు వెళ్లిపోవడంతో రాష్ట్ర సచివాలయం బోసిపోయింది. ఈ తొమ్మిదిరోజుల పాటు మంత్రులు సొంత జిల్లాల్లో విధింగా పర్యటించాలని ముఖ్యమంత్రి సూచించడంతో మంత్రులు సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. గత మూడు రోజుల నుండి బతుకమ్మ చీరల పంపిణీలో వీరంతా నిమగ్నమయి పోయిన సంగతి తెలిసిందే