టీడీపీ నేతలు తెలంగాణలో కాంట్రాక్ట్ లు చేస్తే తప్పేంటి?
- రేవంత్ వ్యాఖ్యలపై గళం విప్పుతున్న ఏపీ టీడీపీ నేతలు
- రేవంత్ పై ఎదురుదాడి మొదలుపెడుతున్న టీడీపీ నేతలు
గత నాలుగు రోజులుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నోరు విప్పని ఏపీ టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. నెమ్మదిగా రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి మొదలుపెడుతున్నారు. అసలు కాంట్రాక్టులు తీసుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. చూడబోతే ఈ విషయంలో వారికి అధిష్టానం నుంచి ఏవైనా సంకేతాలు అందాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ రోజు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న..ఏపీ టీడీపీ నేతలు తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సోము వీర్రాజు.. టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం బుద్ధా వైసీపీ నేతలమీద విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి పెట్టుబడులు తేవడం కోసమే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు ఆయన చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ప్రైవేటు విమానాల్లో వెళ్లిన చరిత్ర మీదేనని, వైఎస్, చంద్రబాబు విదేశీ పర్యటనలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బొత్సను ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ హయాంలో దోచుకునేందుకే విదేశీ పర్యటనలు జరిగాయని వెంకన్న ఆరోపించారు. అలాగే ఈడీ సీజ్ చేసిన డబ్బు ప్రజలకు పంచిపెట్టి జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేయాలని సూచించారు. జగన్ తీరు నచ్చకే వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.