జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దు: గవర్నర్ సంచలన నిర్ణయం
:జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించారు
శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించారు. కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు చేసిన ప్రయత్నాలకు గవర్నర్ తీసుకొన్న నిర్ణయం ఆశనిపాతంగా మారింది.
మరో నెల రోజుల్లో రాష్ట్రంలో గవర్నర్ పాలన ముగియనున్న తరుణంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పీడీపీ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదిపింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసుకొంది.
ఈ విషయమై ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్ కు ఆమె లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం నాడు కూడ గవర్నర్తో సమావేశమైనట్టు కూడ ఆమె తెలిపారు.
ఎన్సీ, కాంగ్రెస్తో కలిసి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గవర్నర్కి లేఖ రాశారు. బుధవారం ఉదయం ఈ మూడు పార్టీల నేతలు కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి సమావేశమయ్యారు.ఈ విషయాన్ని ముఫ్తీ ట్వీట్ చేశారు.
తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ను కోరిన కొద్దిసేపటికే అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరో నెల రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన ముగియనుంది. ఈ తరుణంలో అసెంబ్లీ రద్దు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.