'జబర్దస్త్': నాగబాబు కోసం ఆడియన్స్ వెయిటింగ్!
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఎంత పాపులరో.. షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే నాగబాబు, రోజాలు కూడా అంతే పాపులర్. స్కిట్ లతో పాటు షోలో వీరిద్దరూ వేసే పంచ్ లను ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే కొంతకాలంగా వీరిద్దరూ ఈ షోకి దూరమయ్యారు. దానికి కారణం రాజకీయాలే.. రోజా వైఎస్సార్ సీపీ తరఫున నగరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా, నాగబాబు జనసేన పార్టీ తరఫున నరసాపురం నుండి పోటీ చేశారు. దీంతో జబర్దస్త్ షోని దూరం పెట్టారు.
వీరి స్థానాల్లో శేఖర్ మాస్టర్, మీనా, జానీ మాస్టర్ వచ్చి చేరారు. అయితే షోకి మాత్రం వారు కొత్తదనం తీసుకురాలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగబాబు, రోజాల మాదిరి స్పాంటేనియస్ గా స్పందించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
నాగబాబు మళ్లీ షోకి రావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇటీవల నాగబాబు త్వరలోనే తాను 'జబర్దస్త్' షోలో పాల్గొంటానని చెప్పారు. ఎంపీగా గెలిచినా.. షోని మాత్రం విడిచిపెట్టే సమస్యే లేదని అంటున్నారు.