అనుపమా పరమేశ్వరన్పై ట్రోల్స్.. పనిలేనోళ్లు పెట్టే కామెంట్లు అంటూ టిల్లుగాడు ఫైర్..
`టిల్లు స్వ్కైర్` హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా దీనిపై సిద్దు జొన్నలగడ్డ స్పందించారు. ఈవెంట్ వేదికగా క్లారిటీ, కౌంటర్ ఇచ్చాడు.
అనుపమా పరమేశ్వరన్ ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా కనిపించింది. కానీ ఇప్పుడు ఆమె మారుతున్న కాలం తగ్గట్టుగా మారిపోయింది. `టిల్లు స్వ్కైర్`లో కాస్త బోల్డ్ రోల్ చేసింది. ఇందులో లిప్ లాకులు, రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఆమెపై రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో గ్లామర్ పాత్రలు చేయడంపై అనపమా పరమేశ్వరన్ స్పందించింది. ఎప్పుడూ వెజ్ తినలేం కదా, అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా తినాలి అని ఆయా కామెంట్లకి కౌంటర్ ఇచ్చింది.
అయితే లెటెస్ట్ గా `టిల్లు స్వ్కైర్` సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో హీరోహీరోయిన్ సిద్దుజొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లిప్ కిస్ పెట్టుకున్నారు. అనుపమా చేయి కాస్త అసభ్యకరంగా అనిపించింది. దీంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లతో రెచ్చిపోయారు. ఆమెని దారుణంగా ట్రోల్ చేశారు. ఇంకా ట్రోల్ నడుస్తుంది. తాజాగా దీనిపై హీరో సిద్దు జొన్నలగడ్డ స్పందించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఐటీసీ కొహినూర్లో జరిగింది.
ఈ ఈవెంట్కి హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ రాలేదు. ఈ విషయం చెబుతూ, ఆమె ఈవెంట్కి రాకపోవడానికి ఓ కారణం ఉందన్నారు సిద్దు. `నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో ఒక హ్యాండ్ పొజీషన్ చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. హీరోహీరోయిన్లకి సంబంధించి చాలా వరకు ఇలాంటి వాటిపై అందరి ఫోకస్ ఉంటుంది. పదిరకాలుగా మాట్లాడతారు. దానికి నేనేమి అనడం లేదు. కానీ ఫీమేల్ కోస్టార్, ఫీమేల్ యాక్టర్స్ గురించి కామెంట్ చేసేటప్పుడు ఓ పరిమితి ఉంటుందని, మనం ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తే అది ఆ అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేలా ఉండాలి, ఇబ్బంది పడేలా ఉండకూడదు. ఇది చాలా సెన్సిటిల్ మ్యాటర్. మీరు చూసింది నిజం కాదు. కానీ కొంతమంది ఏ పని లేక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వాళ్లు చేసే కామెంట్లు అవి. ఆ విషయాల్లో అందరం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మెయింటేన్ చేద్దాం` అని రీక్వెస్ట్ చేశాడు సిద్దు జొన్నలగడ్డ.
ఇక ఇందులో `టిల్లు స్వ్కైర్` సినిమా గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో తెలిపారు. `డీజేటిల్లు` మూవీ పెద్ద హిట్ అయ్యాక `టిల్లు స్వ్కైర్`తో వెళ్తున్నామంటే పెద్ద యుద్దానికి పోతున్నామని అనిపించిందన్నారు సిద్దు. `ఈ సినిమాలో వారి పాత్రలు చాలా బాగుంటాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. `డీజే టిల్లు` అనేది యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. కానీ సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులకు, అందునా ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు టిల్లు పాత్ర బాగా నచ్చడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. టిల్లు పాత్రని ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకున్నారు. నన్ను సిద్ధు కంటే కూడా ఎక్కువగా టిల్లు అనే పిలుస్తున్నారు. అందుకే సీక్వెల్ అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను. మొదటి పార్ట్ లా ఉండకూడదు, కానీ అదే స్థాయిలో వినోదాన్ని పంచాలి. అలాగే టిల్లు పాత్రలో ఉన్న సోల్ మిస్ అవ్వకూడదు.
హీరోయిన్ పాత్ర కూడా మొదటి పార్ట్ లాగే బాగా ఫేమస్ అవ్వాలి. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాము. అయినా మొదట కాస్త భయపడ్డాము. యుద్ధం గెలుస్తామో లేదో మన చేతుల్లో ఉండదు.. కానీ పోరాటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది నమ్మే మా టీం అంతా `టిల్లు స్క్వేర్` కోసం శాయశక్తులా కృషి చేశాం. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మాకు సంతృప్తి కలిగింది. మొదటి పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. త్రివిక్రమ్ కి చాలా చాలా థాంక్స్. సినిమా కొన్నిసార్లు మాకు అర్థమైన దానికంటే.. త్రివిక్రమ్ కి ఎక్కువ అర్థమై మాకు ఎంతో సాయం చేశారు. మార్చి 29న థియేటర్లకు రండి, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది` అని తెలిపారు సిద్దు జొన్నలగడ్డ. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, మల్లిక్ రామ్, రామ్ మిర్యాల, భీమ్స్, కాసర్ల శ్యామ్ ఇలా టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పాల్గొన్నారు.