షాకింగ్ రేటుకు ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' ఓటిటి రైట్స్, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ ?
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
రీసెంట్ గా 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అడ్డూ అదుపూ లేకుండా దూసుకుపోతుంది. దాంతో కేవలం మళయాళంలోనే కాదు మన మిగతా భాషల్లోనూ ఈ సినిమా గురించిన డిస్కషన్సే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆ చిత్రం ఓటిటి కు ఎంత రేటుకు అమ్ముడైందనేది హాట్ టాపిక్ గా మారింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ 35 కోట్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే మే 9న ఈ మలయాలం మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్పై ఈ వారంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు చెబుతోన్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చిత్రం కథేమిటంటే...
శాంతన్ (రోషన్ శాన్వాజ్), బీబీ (మిథున్ జై శంకర్), అజు(ప్రణవ్రాజ్) వీళ్లు ముగ్గరూ ఇంజినీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరు వస్తారు. అయితే ఎప్పటిలాగే కాలేజీలో సీనియర్స్ ఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో దారుణంగా ఇబ్బంది పెడతారు. అంతేకాకుండా వీళ్లు ముగ్గురినీ బట్టలు ఊడదీయించి సిటీ అంతా కార్లో తిప్పి తమ ప్లేస్కు తీసుకువెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వీళ్లని కొడతారు.దాంతో సీనియర్స్పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల వల్ల కాదు. అందుకే వాళ్లు లోకల్ గ్యాంగ్స్టర్ రంగా రావు అలియా రంగాతో (ఫహాద్ ఫాజిల్) ని సీన్ లోకి తేవాలనుకుంటారు. అందుకోసం ఈ ముగ్గురు కుర్రాళ్లు వెళ్లి రంగా తో స్నేహం చేస్తారు. ఆ తర్వాత రంగాకు చెప్పి ఈ ముగ్గురిని ర్యాగింగ్ చేసిన కుట్టి అండ్ టీమ్ను చితక్కొట్టిస్తారు.
అక్కడ నుంచి రంగా మనుషులుగా అజు, బీబీ, శాంతన్లకు ముద్రపడుతుంది. దాంతో వాళ్లకి కాలేజీలో ఎదురేలేకుండాపోతుంది. అయితే రంగా టీమ్లో చేరిన అజు, బీబీ, శాంతన్ జీవితాలు ఓ గమ్మత్తైన టర్న్ తీసుకున్నాయని వారు గమనించరు. ఈ క్రమంలో చదువును సైతం వారు నిర్లక్ష్యం చేస్తారు. రంగాతో బాగా క్లోజ్ అయ్యిన తర్వాత తమకు సాయం చేసిన రంగానే చంపాల్సిన పరిస్దితి బీబీ, అజు, శాంతన్ లకు వస్తుంది. అప్పుడు ఏమైంది...ఈ విషయం తెలుసుకున్న రంగా ఈ ముగ్గురిని ఏం చేశాడు? అన్నదే ఆవేశం మూవీ కథ.
జిత్తు మాధవన్ రాసి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్, ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుశిన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు.