స్టార్టప్స్ @700 కోట్ల డాలర్లు
గతేడాది స్టార్టప్ సంస్థలు వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీల ద్వారా 700కి పైగా డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. వీటిల్లో స్విగ్జీ, పేటీఎం మాల్, జొమాటో, తదితర సంస్థలు అగ్ర తాంబూలం అందుకున్నాయి.
వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ రూపంలో ప్రముఖ ఈ- కామర్స్, కన్జూమర్ ఇంటర్నెట్ కంపెనీలు 2018లో 700 కోట్లకు పైగా డాలర్ల పెట్టుబడులను సమీకరించినట్లు ఓ సర్వే తేల్చింది.
వీటిలో అత్యధికంగా ఓయో, స్విగ్గీ, బిజూస్, పేటీఎం మాల్, పిన్ ల్యాబ్స్, జొమాటో, ఉడాన్, పాలసీ బజార్, క్యూర్ఫిట్ల వాటా 460 కోట్ల డాలర్లు ఉన్నదని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నిర్వహించిన సర్వే పేర్కొంది.
ట్రావెల్, హాస్పిటాలిటీ, పేమెంట్స్ అండ్ వ్యాలెట్స్, ఎడ్యుటెక్, ఫిన్టెక్, వైద్య రంగం, ఈ-కామర్స్, కన్జూమర్ ఇంటర్నెట్ సెగ్మెంట్లలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
అంతేకాక ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ను రూ.1600 కోట్లతో అమెరికా రిటైల్ మేజర్ వాల్మార్ట్ కొనుగోలు చేయడం, టెన్సెంట్స్, పేటీఎం, బిగ్బాస్కెట్లో చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా, బిజూస్, స్విగ్గీల్లో మరో సంస్థ నాస్పర్స్ పెట్టుబడులు పెట్టడం కూడా స్టార్టప్లకు కలిసొచ్చింది.
నిత్యం పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ అక్షరాస్యత, గ్రామీణ స్థాయిలో ఈ-కామర్స్పై అవగాహన పెరగడం, చౌకగా లభిస్తున్న ఇంటర్నెట్ డేటా సర్వీసులు, స్థానిక భాషలో మొబైల్ తయారీదారులు అందిస్తున్న వసతులు.. ఇలా అత్యధిక మొత్తంలో సమీకరించేందుకు దోహదపడ్డాయని సర్వేలో వెల్లడైంది.
దేశీయంగా నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా 2019లోనూ అలాగే స్టార్టప్స్ ముందుకు దూసుకెళ్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కస్టమర్ల అభిరుచులు, అంచనాలను అందుకునేలా వివిధ రకాల సెగ్మెంట్లలో మార్పులు చేయడంతో సత్ఫలితాలనిస్తాయని సర్వేలో పేర్కొంది. కృత్తిమ మేథస్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లాంటి అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లగలిగితే ఆన్లైన్ వాణిజ్యంలో మరిన్ని అద్భుతాలు సాధించేందుకు అవకాశాలుంటాయని విశ్లేషకులు అంటున్నారు.
పలు సర్వీసుల్లోకి సంఘటితం కావడంతోపాటు స్టార్టప్ సేవలు విస్తరించాల్సిన అవసరం ఉన్నదని సర్వే తెలిపింది. ఓమ్నీ చానెల్ స్ట్రాటర్జీ అమలుతో డిజిటల్ లిటరసీ, డిజిటల్ లావాదేవీలు, రూరల్ ఈ-కామర్స్ పెంపుదల, డేటా డ్రైవెన్ పర్సనలైజేషన్ తదితర అంశాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని సర్వే తెలిపింది.