కొత్త మేనేజ్మెంట్ చేతుల్లోకి జెట్ ఎయిర్వేస్: నరేశ్ గోయల్ నిష్క్రమణ నేడే?
దాదాపు 25 ఏళ్లపాటు సంస్థను నిర్విఘ్నంగా నడిపిన జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయల్కు ఆ సంస్థతో బంధం తెగిపోనున్నది.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ‘జెట్ ఎయిర్వేస్’ సమస్యలు తొలిగిపోయే దిశగా కీలక పరిణామం చోటు చేసుకోనున్నదా? అంటే ఆ సంస్థ సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. సంస్థ వ్యవస్థాపక ప్రమోటర్ నరేష్ గోయల్ సంస్థ నుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది.
నరేష్ గోయల్తోపాటు ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డుకు రాజీనామా చేయనున్నారని తాజా రిపోర్టు ద్వారా తెలుస్తోంది. జెట్ఎయిర్వేస్ సంక్షోభంపై చర్చించేందుకు బోర్డు సోమవారం సమావేశం కానుంది.
ఈ సమావేశం అనంతరం దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఒక కొత్త తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నారు. తద్వారా నరేష్ గోయల్ సొంతమైన 51 శాతం వాటాను బ్యాంకుల కన్జార్టియం సొంతం చేసుకుంటుంది.
అటు పిమ్మట కొత్త కొనుగోలు దారుకోసం అన్వేషించనున్నది. అలాగే ఎస్బీఐ మాజీ ఛైర్మన్-మాజీ సీవీసీ కమిషనర్ జానకి వల్లభ్ను జెట్ ఎయిర్వేస్ బోర్డులోకి ఆహ్వానించనున్నారు.
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం నిజమైతే జెట్ ఎయిర్వేస్ పూర్తిగా నూతన యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్బీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ జెట్ ఎయిర్వేస్ బోర్డు మాజీ సభ్యుడు శ్రీనివాసన్ విశ్వనాథన్ను సంస్థ సారధ్య బాధ్యతలు చేపట్టాలని ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం కోరే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకుముందు విశ్వనాథన్.. జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. 2018 ఆగస్టు వరకు దాదాపు మూడేళ్ల పాటు శ్రీనివాసన్ విశ్వనాథన్ సంస్థ డైరెక్టర్గా సేవలందించారు.
ఇక ఇప్పటివరకు 24 శాతం వాటాను కలిగి బోర్డులో కొనసాగుతున్న ఎతిహాద్ తన వాటాను మున్ముందు క్రమంగా తగ్గించుకుంటుంది. తదనుగుణంగా జెట్ ఎయిర్వేస్ డైరెక్టర్ల బోర్డు నుంచి ఇద్దరు ఎతిహాద్ సభ్యులు తప్పుకుంటారు అంటే రాజీనామా చేస్తారు.
ప్రస్తుతం లండన్లో ఉన్న నరేష గోయల్ అక్కడినుంచే 23వేల ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. ఈ వార్తలు వాస్తవరూపం దాలిస్తే దాదాపు పాతికేళ్లపాటు సంస్థను విజయపధంలో నడిపించిన నరేష్ గోయల్ ప్రస్థానం ముగియనుంది.
సోమవారం సాయంత్రానికి ఫార్మల్గా నరేశ్ గోయల్ నిష్క్కమణపై ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే పలువురు సీనియర్ ఉన్నతాధికారులు సంస్థను వీడగా, వేతన బకాయిలు చెల్లించకపోతే తాము కూడా రాజీనామా బాట పట్టక తప్పదని పైలట్లు హెచ్చరించారు.
అటు అద్దె బకాయిలు చెల్లించలేక, పైలట్లు లేక రోజు రోజుకు జెట్ ఎయిర్వేస్ రద్దవుతున్న విమానాల సంఖ్య పెరుగుతోంది. కాగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్వేస్ మరింత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నేతృత్వంలో భారీ రుణాలిచ్చిన బ్యాంకులు సంస్థను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే ఇటీవలే సంస్థ మళ్లీ గాడిలో పడాలంటే నరేష్ గోయల్, ఆయన భార్య , మరో ఇద్దరు డైరెక్టర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ సీఈఓగా ఉన్న వినయ్ దూబెను అలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.