ముందుంది ముసళ్ల పండుగ: ఉర్జిత్ ‘రాజీ’నామా.. జైట్లీ ముక్తాయింపులు
ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై గతంలోనూ చర్చలు జరిగాయి. కానీ ఈ దఫా నేరుగా మీడియా ముందుకు రావడంతో కేంద్రం తీరేమిటో జనానికి అర్థమవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు తీసుకున్న మొండి బాకీలు వసూలు చేయాలని ఆర్బీఐ ఒత్తిడి తేవడం కేంద్రానికి సుతారామూ ఇష్టం లేదు. కానీ ఉర్జిత్ ‘రాజీనామా’ ఉరుమడంతో ఆర్థికశాఖ వెనుకడుగు వేసినట్లు కనిపించినా ‘సెక్షన్ 7’ దండం ఊసెత్తకుండా దాటేసింది.
బ్యాంకులు ఇష్టానుసారంగా రుణాలిస్తుంటే ఆర్బీఐ ఏం చేస్తున్నదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరిక స్వరంతో కూడిన వ్యాఖ్యలు.. అంతకుముందు ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణలో కేంద్రం అడ్డుకుంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన ప్రకటనల మధ్య ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కిన్నుడయ్యారు. నిత్యం ఘర్షణ పడేకన్నా రాజీనామా చేయడమే సబబని బుధవారం ఉదయం సంకేతాలిచ్చారు.
ఉర్జిత్ రాజీనామా వదంతులతో ఆర్థిక శాఖ ‘రాజీ’
తదనుగుణంగా వదంతులు వ్యాపించడంతో ఒక ‘రాజీ’ ప్రకటనతో సర్దుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రస్తుతానికి వివాదానికి తెర దించాలని భావిస్తున్నది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామంటూనే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 కింద జారీ చేసిన మార్గదర్శకాల ఊసే ఎత్తలేదు.
తాజాగా విత్త మంత్రి అరుణ్ జైట్లీ సంప్రదింపులు మామూలేనంటూ.. అవి బహిర్గతం చేయలేమని.. ఇంతకంటే చెప్పేదేమీ లేదని ముక్తాయింపునిచ్చి తప్పుకున్నారు. మరోవైపు ఇప్పటితో ఇది ఆగదని ఆర్థిక శాఖ అదికారులు సంకేతాలిచ్చారు.
ఆర్బీఐ, కేంద్రం మధ్య జోరుగా క్లైమాక్స్ ఘటనలు
కేంద్రానికి, ఆర్బీఐ మధ్య కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు వంటి ఘటనలు బుధవారం వేగంగా జరిగిపోయాయి. ఏ క్షణంలోనైనా ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తారని రోజంతా ఊహగానాలు షికారు చేశారు.
దీంతో అప్రమత్తమైన ఆర్థిక శాఖ సాయంత్రం కల్లా ప్రకటన చేసిన ఆర్థిక శాఖ.. ఆర్బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందేనని, దానిని తాము గౌరవిస్తామని కూడా స్పష్టం చేసింది. దీంతో ప్రచ్ఛన్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడినట్లు కనిపించినా రాజకీయ పక్షాలు మాత్రం భగ్గుమన్నాయి. స్వతంత్ర వ్యవస్థలన్నింటినీ కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డాయి.
లిక్విడిటీ కట్టడీలో ఆర్బీఐ విఫలమైందన్న ఆర్థికశాఖ
మరోవంక లిక్విడిటీ సంక్షోభాన్ని కట్టడి చేయటంలో ఆర్బీఐ విఫలమైందన్న విమర్శతో ఈ వివాదం ఇంతటితో ముగియలేదని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు సంకేతాలిచ్చారు. విద్యుత్ రంగంలో మొండిబాకీలపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తుండటం కేంద్రానికి సుతరామూ నచ్చటం లేదు.
పైపెచ్చు లిక్విడిటీ పెంచటానికి తగ్గు చర్యలకూ ముందుకు రావటం లేదు. ఈ రెండంశాలపై ఆర్బీఐపై అసంతృప్తి ఉన్నా, ప్రస్తుతానికి కొంత రాజీ ధోరణితో వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ‘ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాల్సిందే. దాన్ని మేం గౌరవిస్తాం’’ అని స్పష్టం చేసింది.
ప్రజా ప్రయోజనాల పేరిట ఆర్థికశాఖ దాటవేత
అయితే, ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ పనిచేయాల్సి ఉందని పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సు కోసమే అనేక అంశాలపై మిగతా నియంత్రణ సంస్థల మాదిరిగానే ఆర్బీఐతోనూ కేంద్రం విస్తృతంగా చర్చలు జరుపుతుంటుంది.
కానీ ఈ చర్చల వివరాలను కేంద్రం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. తుది నిర్ణయాలను మాత్రమే ప్రకటిస్తూ వస్తోంది. ఇకపై కూడా ఇది కొనసాగుతుంది‘ అని ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది.
ఆర్బీఐపై నియంత్రణకు సెక్షన్7 ప్రయోగం?
పలు అంశాలపై విభేదిస్తున్న ఆర్బీఐని నయానా భయానా తమ దారికి తెచ్చుకునేందుకు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ని కేంద్రం ప్రయోగించిందన్న వార్తలు ఆర్థిక వర్గాల్లో దుమారం రేపాయి.
ఒకవేళ సెక్షన్ 7 కింద కేంద్రం గానీ ఆదేశాలు జారీ చేసిన పక్షంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయొచ్చని కూడా బుధవారం వదంతులు ఊపందుకున్నాయి. నిజానికి ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి ఉన్నా నిర్దిష్ట సందర్భాల్లో ఈ సెక్షన్ కింద దానికి ఆదేశాలిచ్చే అధికారాలు కేంద్రానికి ఉన్నాయి.
ఈ సెక్షన్ను ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ ఉపయోగించలేదు. రెండు భాగాలుగా ఉండే ఈ సెక్షన్ కింద తొలుత చర్చలు, ఆ తర్వాత చర్యలు ఉంటాయి. ఈ సెక్షన్ పరిధిలో ప్రస్తుతం చర్చల ప్రక్రియ మాత్రమే జరుగుతోందని, ఇది చర్యల రూపం దాల్చే అవకాశం లేకపోవచ్చని సంబంధిత ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
సెక్షన్ 7 కింద ఆర్బీఐకి కేంద్రం మూడు లేఖలు
సెక్షన్ 7 (1) కింద వివిధ అంశాలపై ఆర్బీఐకి కేంద్రం ఇప్పటిదాకా కనీసం మూడు లేఖలు పంపినట్లు వెల్లడించాయి. పలు బ్యాంకుల్ని కఠినతరమైన సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి తెస్తున్న ఆర్బీఐ.. విద్యుత్ రంగ మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకులకు కొంత మినహాయింపునివ్వాలని తొలి లేఖలో కేంద్రం సూచించినట్లు తెలిసింది.
రెండో లేఖలో వ్యవస్థలో నగదు లభ్యతను మెరుగుపర్చేందుకు ఆర్బీఐ దగ్గరున్న నిల్వలను ఉపయోగించాలని సూచించింది. అటు మూడో లేఖలో చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకు రుణాల నిబంధనలను సడలించాలని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, సెక్షన్ 7ని ప్రయోగించటం గురించి గానీ, లేఖల గురించి గానీ ప్రస్తావన లేకుండానే ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఆర్బీఐ చట్టం చెబుతున్నదిది..
‘ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో.. అవసరమైన సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్తో సంప్రదింపుల అనంతరం కేంద్రం రిజర్వ్ బ్యాంక్కు తగు ఆదేశాలు ఇవ్వొచ్చు‘ అని 1934 నాటి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 (1) చెబుతోంది. ఇక సెక్షన్ 7 (2) ప్రకారం.. అవసరమైతే ఆర్బీఐని నిర్వహించే బాధ్యతలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి కూడా కట్టబెట్టే అధికారం కేంద్రానికి ఉంది.
ఆర్బీఐ గవర్నర్ను, నలుగురు డిప్యూటీ గవర్నర్లను, స్వతంత్ర డైరెక్టర్లను ప్రధాన మంత్రి సారథ్యంలోని నియామకాల కమిటీ (ఏసీసీ) ఎంపిక చేస్తుంది. ఆర్బీఐ చట్టం ప్రకారం వీరితో పాటు ఇతరత్రా డైరెక్టర్లను కూడా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలున్నాయి.
ఏసీసీ ఇటీవలే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవేత్త ఎస్ గురుమూర్తిని, సహకార ఉద్యమ నేత ఎస్కే మరాఠేలను ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. గమ్మత్తేమిటంటే ఇప్పటి వరకు బహిరంగంగా ఆర్థిక విధానాలపై స్పందించని ఆరెస్సెస్ అనుబంధ ఆర్థిక సంస్థ స్పందిస్తూ ఆర్బీఐ తనకు గల స్వయంప్రతిపత్తిని పట్టించుకోకుండా.. కేంద్రం ఆదేశాలను ఔదాల్చాల్సిందేనని తేల్చేయడం గమనార్హం.