Asianet News TeluguAsianet News Telugu

ముదిరిన సంక్షోభం.. పండుగ కూడా కలిసి రాలే!

ప్రస్తుత పండుగల సీజన్ కూడా దేశీయ ఆటోమొబైల్​ రంగానికి అచ్చి రాలేదు. ఒకవైపు బుసలు కొడుతున్న ఆర్థిక మాంద్యం ఒకవైపు.. మరోవైపు నిధుల లభ్యత సమస్య వెంటాడుతున్నది. ఫలితంగా వాహనాల కొనుగోలుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Passenger Vehicle Sales Fall Nearly 24% In September: Industry Body SIAM
Author
Hyderabad, First Published Oct 12, 2019, 1:16 PM IST

న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్ కూడా దేశీయ ఆటోమొబైల్​ రంగానికి అచ్చి రాలేదు. ఒకవైపు బుసలు కొడుతున్న ఆర్థిక మాంద్యం ఒకవైపు.. మరోవైపు నిధుల లభ్యత సమస్య వెంటాడుతున్నది. ఫలితంగా వాహనాల కొనుగోలుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

దీంతో ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. వరుసగా 11వ నెలలోనూ ప్రయాణ వాహనాల విక్రయాలు పడిపోయాయి. దేశీయంగా ప్యాసింజర్​ వాహనాల విక్రయాలు 2019 సెప్టెంబర్​లో 23.69 శాతం తగ్గాయని ఇండియన్​ సొసైటీ ఆఫ్​ ఇండియన్​ ఆటోమొబైల్​ మ్యానుఫాక్చరర్స్​ (సియామ్​) పేర్కొంది.

పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం పని చేయడం లేదు. సెప్టెంబర్​ నెలలో ప్రయాణ వాహనాల అమ్మకాలు 2,23,317 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్​ వెల్లడించింది. 2018 సెప్టెంబర్​ విక్రయాలు 2,92, 660 యూనిట్లుగా ఉన్నట్లు గుర్తుచేసింది.దేశీయ కార్ల విక్రయాల్లో 2018 సెప్టెంబర్​తో పోల్చితే ఈ ఏడాది 33.4 శాతం క్షీణత నమోదయింది. 2018 సెప్టెంబర్​లో 1,97,124 కార్లు అమ్ముడవగా.. గత నెలలో ఇది 1,31, 281 యూనిట్లకు పరిమితమైంది.

మోటర్​ సైకిల్​ విక్రయాలు గత నెలలో 23.29 శాతం తగ్గాయి. 2019 సెప్టెంబర్​లో 10,43,624 యూనిట్లకు అమ్ముడవగా.. 2018 సెప్టెంబర్​లో 13,60,415 యూనిట్ల విక్రయాలు జరిగాయి.ద్విచక్ర వాహనాల అమ్మకాలు సెప్టెంబర్​లో 22.09 శాతం క్షీణించాయి. 2019 సెప్టెంబర్​లో 16,56,774 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్​ పేర్కొంది. 2018 సెప్టెంబర్​లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 21,26,445 యూనిట్లుగా ఉన్నాయి.

వాణిజ్య వాహనాల విక్రయాలు 2019 సెప్టెంబర్​లో 39.06 శాతం క్షీణించి.. 58,419 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి వీటి అమ్మకాలు 95,870 యూనిట్లుగా ఉన్నాయి.అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా 20,04,932 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2018 సెప్టెంబర్​లో అమ్ముడైన 25,84,062 యూనిట్లతో పోల్చితే ఇది 22.41 శాతం తక్కువ అని సియామ్​ పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య విక్రయాలు 23.56 శాతం పడిపోయాయి. ఆగస్టు విక్రయాలు 31.57 శాతం పతనమయ్యాయి. ఇది గత రెండు దశాబ్దాల్లో అత్యల్పం. ఆర్థిక మందగమనానికి తోడు ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వాహనాల కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ లేదని సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా తెలిపారు. 

ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలతో కొన్ని నెలల్లో ఆటోమొబైల్ రంగం పుంజుకునే అవకాశం ఉన్నదని సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పండుగల సీజన్‌లో ప్రకటించిన భారీ రాయితీలతో గత 10-12 రోజుల్లో అమ్మకాల్లో కదలిక మొదలైందని, దీపావళి నాటికి పరిస్థితులు చక్కబడతాయన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios