కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న జగన్: నిరసనలకు బాబు ఆదేశం
కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన మంగళవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వచ్చినప్పుడు చేసిన నిరసనల కంటే మిన్నగా జగన్కు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జగన్ మరిచారేమో కానీ ప్రజలు మరువలేదని ఎద్దేవా చేశారు.
ఏపీ పడుతున్న కష్టాలకు కేసీఆరే కారణమని చంద్రబాబు ఆరోపించారు. కేసుల కోసం జగన్.. కేసీఆర్తో జతకట్టారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్కే జగన్ మద్ధతిచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.
కేసుల మాఫీ కోసం మొత్తం ఏపీ ప్రజలతో ఊడిగం చేయించాలని జగన్ అనుకుంటున్నారని సీఎం ఆరోపించారు. ఏపీ ప్రజలు నీళ్లు తాగాలన్నా, తన దయాదాక్షిణ్యాలపైనే జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.