Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో ప్రారంభమైన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం: అతిథులను సన్మానించిన జగన్

తిరుపతిలో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఆదివారం నాడు  మధ్యాహ్నం  ప్రారంభమైంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  ఈ సమావేశానికి  కేరళ, తమిళనాడు,తెలంగాణ రాష్ట్రాల సీఎంలు  హాజరు కాలేదు.

southern council meeting begins in Tirupati
Author
Tirupati, First Published Nov 14, 2021, 3:24 PM IST


తిరుపతి:  టెంపుల్ సిటీ Tirupati లో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఆదివారం నాడు  ప్రారంభమైంది. ఈ  సమావేశం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వాగతోపాన్యాసం చేశారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల  సీఎంలు పినరయ్ విజయన్, ఎంకె స్టాలిన్, కేసీఆర్ లు హాజరు కాలేదు. ఈ రాష్ట్రాల నుండి మంత్రులు,  రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

  ఆయా రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుండి హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు.  ఈ సమావేశానికి కేరళ రాష్ట్ర మంత్రి రాజన్, తమిళనాడు రాష్ట్రం నుండి విద్యా శాఖ మంత్రి పొన్నుమూడి హాజరయ్యారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్  దేవేంద్ర కుమార్ జోషీ లు హాజరయ్యారు.

Southern Zonal Council  సమావేశానికి హాజరైన అతిథులను ఏపీ సీఎం ys jagan సన్మానించారు. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం–1956 ప్రకారం ఐదు జోనల్‌ కౌన్సిల్స్‌ ఏర్పాటయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలతో ఏర్పడ్డ కౌన్సిల్‌ ఐదోది.రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం, కేంద్రం –రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధాలను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా జోనల్‌ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు.  మొట్టమొదటి సౌత్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం 1957 జులై 11న మద్రాసులో నిర్వహించారు. మొత్తంగా ఇప్పటి వరకూ 28 సార్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశాలు జరిగాయి. చివరగా 2018 సెప్టెంబరు 18,న సౌత్‌ జోనల్‌ కమిటీ సమావేశం బెంగళూరులో జరిగింది. 

also read:Southern Zonal Council: జల వివాదాలతో పాటు ఏపీ అంశాలను ప్రస్తావించనున్న జగన్

 ఈ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి చైర్మన్‌గా, రొటేషన్‌ పద్ధతిలో ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రులెవరైనా రాలేకపోతే మంత్రులు హాజరవుతారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక, సామాజిక పరమైన అంశాలు చర్చిస్తారు. ఈ అంశాల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రాల మధ్య పెండింగ్‌ అంశాలు, సరిహద్దు వివాదాలు, భాషా పరంగా మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, అంతర్‌ రాష్ట్ర రవాణా, రాష్ట్రాల పునర్‌ విభజన చట్టంలో పెండింగ్‌ అంశాలు.. తదితర విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి.

ఈ సమావేశంలో Andhra pradesh  సీఎం వైఎస్ జగన్ తమ రాష్ట్రానికి చెందిన పలు అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించాలని భావిస్తున్నారు. మూడు రాజధానులకు నిధులు, జల వివాదాలతో పాటు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు.రాష్ట్ర విభజన జరిగిన ఆర్థికంగా ఏర్పడిన రెవిన్యూ లోటు కింద రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావించనుంది ఏపీ సర్కార్. రేషన్‌ బియ్యంలో హేతు బద్ధతలేని కేంద్రం కేటాయింపులను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios