బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు
ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనే చంద్రబాబునాయుడు నిర్ణయం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలలో ఆందోళనకు కారణమైంది.
అమరావతి: ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనే చంద్రబాబునాయుడు నిర్ణయం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలలో ఆందోళనకు కారణమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ బాబు టిక్కెట్లను కేటాయిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గెలుపు గుర్రాలకే బాబు టిక్కెట్లను కేటాయించనున్నారు.
గతానికి భిన్నంగా అభ్యర్థులను కేటాయించనున్నట్టు బాబు బుధవారం నాడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే పనితీరు ఆధారంగానే టిక్కెట్లను కేటాయిస్తామని బాబు గతంలో పలుమార్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తీరుపై చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడూ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయింపు ఉండే అవకాశం లేకపోలేదు.
గత ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం వల్ల గెలవాల్సిన చోట కూడ ఓటమి పాలు కావాల్సి వచ్చిందని టీడీపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. దీంతో ఈ దఫా ఎన్నికలకు కనీసం రెండు మాసాల ముందే అభ్యర్థులను ప్రకటించాలని బాబు యోచిస్తున్నారు.
ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే టిక్కెట్టు దక్కని అభ్యర్థులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. అయితే టిక్కెట్టు దక్కనివారిని బాబు ఎలా సంతృప్తి పరుస్తారో అనే చర్చ కూడ లేకపోలేదు.
గత ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు దక్కాయి. అయితే వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు 20కు పైగా ఉన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడ టీడీపీ బలంగానే ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లో చంద్రబాబునాయుడు ఎవరికీ టిక్కెట్లు కేటాయిస్తారనే చర్చ కూడ టీడీపీలో ఉంది.
నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటించని చరిత్ర టీడీపీలో ఉంది. అయితే అందుకు భిన్నంగా ఈ దఫా అభ్యర్థులను ముందే ప్రకటిస్తానని బాబు ప్రకటించడం పార్టీ నేతల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ సిట్టింగ్ల్లో కొందరికి మినహా అందరికీ టిక్కెట్లను కేటాయించింది. ఏపీలో కూడ బాబు అదే పద్దతిని అనుసరిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తే వారంతా గెలిచే అవకాశాలు ఉన్నాయా అనేది కూడ చూడాల్సిన అంశం. గెలిచే అభ్యర్థులకే టిక్కెట్టు ఇవ్వాలనే బాబు నిర్ణయం కొందరు సిట్టింగ్లకు టిక్కెట్టు దక్కకుండా చేసే అవకాశం లేకపోలేదు. అయితే వారికి నామినేటేడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అయితే టిక్కెట్టు దక్కని ఎందరు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారనేది ఊహించలేం. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల నియోజకవర్గం మొత్తం ప్రచారం చేసేందుకు వీలుంటుంది
తమ ప్రత్యర్థుల బలాలు, తమ బలహీనతలను తెలుసుకొనే అవకాశం కూడ లేకపోలేదు. అయితే అదే సమయంలో టిక్కెట్టు దక్కని వాళ్లు కూడ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేం. వీటన్నింటిని అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత వార్తలు
టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే