విత్తనాల కొరతకు చంద్రబాబే కారణం, ఆధారాలు బయటపెట్టిన మంత్రి కన్నబాబు
మరోవైపు జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రి అని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఎందుకు విత్తనాల కొనుగోలుపై దృష్టి సారించలేదో చెప్పాలని నిలదీశారు. జూన్ 8 వరకు విత్తనాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నా ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణమని ఆరోపించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. విత్తన కొరతపై పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు.
రైతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఏపీ సీడ్స్ కు రూ.380కోట్లు దారి మల్లించడమే ప్రధాన కారణమన్నారు. చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన డబ్బుల్లో కనీసం రూ.108 కోట్లు అయినా విడుదల చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు పదేపదే లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో చంద్రబాబుకు వ్యవశాయ శాఖ అధికారులు రాసిన లేఖలను విడుదల చేశారు. నిధులు విడుదల చేయకపోతే విత్తనాలు కొనలేమని స్పష్టం చేసినా కనీసం స్పందించలేదన్నారు.
రైతులందరికీ విత్తనాలు కచ్చితంగా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. 3.8లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంకా వరి, వేరుశనగ విత్తనాల పంపిణీ చేయాల్సి ఉందని ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ, బరోడాల నుంచి విత్తనాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు.
అత్యధిక ధరకు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ నెలలోనే విత్తనాల కొనుగోలుకు చర్యలు చేపడతామని మే నెలలోనే పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రి అని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఎందుకు విత్తనాల కొనుగోలుపై దృష్టి సారించలేదో చెప్పాలని నిలదీశారు. జూన్ 8 వరకు విత్తనాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నా ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు.
చేసిన తప్పులు చేసి తమకు చేతకాదని వ్యాఖ్యానించడం చంద్రబాబు నాయుడుకు తగదన్నారు. వ్యవసాయ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతిలు బయటపెడతానని హెచ్చరించారు మంత్రి కురసాల కన్నబాబు.