ఏపీపై "త్రి"మూర్తుల కుట్ర:చంద్రబాబు ధ్వజం
ఆంధ్రప్రదేశ్ పై ఆ ముగ్గురు కుట్రపన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్కల్యాణ్ లు ఏపీలో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రధాని మోదీకి జగన్, పవన్ లు ఏజెంట్లు అంటూ ధ్వజమెత్తారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ పై ఆ ముగ్గురు కుట్రపన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్కల్యాణ్ లు ఏపీలో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రధాని మోదీకి జగన్, పవన్ లు ఏజెంట్లు అంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణలో వైసీపీ, జనసేన ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, జగన్, పవన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు.
దేశ ప్రయోజనాల కోసం బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్నానని, జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు మూడు పార్టీలు కలిసి వస్తే కుట్రతో అక్కడి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయించిందని బాబు విమర్శించారు. బీజేపీ తప్పుడు పనులను ప్రశ్నించాలని, సరైన సమయంలో బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
నోట్ల రద్దుతో ప్రజలకు కొత్త కష్టాలు తీసుకొచ్చారంటూ కేంద్రంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. జీఎస్టీతో వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐలో సంక్షోభంపై మోదీ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఈడీ, ఐటీలను టీడీపీ నేతలపైకి ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి కోడి కత్తి పార్టీ అడ్డుపడుతోందంటూ వైసీపీని పరోక్షంగా విమర్శించారు. అనంతను ఆదుకుంటానన్న పవన్ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. అవిశ్వాసం పేరుతో వైసీపీ, జనసేన నాటకాలాడాయని చంద్రబాబు గుర్తు చేశారు.