Asianet News TeluguAsianet News Telugu

రైతే..రుషి ('మ‌హ‌ర్షి' రివ్యూ)

శ్రీమంతుడైన మహేష్ బాబు మళ్లీ అమెరికానుంచి వచ్చి ఇండియాలోని ఓ పల్లెలో  మకాం పెట్టాడు. అయితే ఈ సారి రైతు సమస్యలపై దృష్టి పెట్టారు.

Mahesh's Maharshi movie Review
Author
Hyderabad, First Published May 9, 2019, 9:22 AM IST

---సూర్య ప్రకాష్ జోశ్యుల

శ్రీమంతుడైన మహేష్ బాబు మళ్లీ అమెరికానుంచి వచ్చి ఇండియాలోని ఓ పల్లెలో  మకాం పెట్టాడు. అయితే ఈ సారి రైతు సమస్యలపై దృష్టి పెట్టారు.  రోజూ వారి పేపర్లలో, ఛానెల్స్ లో వినపడే రైతుల మరణాలను ఏకరవు పెట్టాడు. అయితే అవి ఎంతవరకూ మహేష్ బాబు లాంటి కమర్షియల్ హీరో సినిమాలో ఇమిడాయి.  రైతుల సమస్యల దిసగా కథను ఎలా అల్లుకున్నారు. ఆ సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపించారా... ‘శ్రీ‌మంతుడు’ చిత్రానికి దీనికి పోలిక ఏమైనా ఉందా, మహేష్ 25 వ చిత్రంగా ఈ సినిమాను ఎంచుకోవటం సబబే అనిపిస్తుందా, అభిమానులు ఆశించే అంశాలు ఉన్నాయా..రైతులు పేరు చెప్పి హీరోయిజం తగ్గించారా , అల్లరి నరేష్ పాత్ర ఏమిటి ..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 

కథేంటి..

అమెరికన్ బేసెడ్ అరిజన్ కంపెనీ అధినేత  రుషి కుమార్ (మ‌హేష్ బాబు)కు ఓడిపోవటం అంటే ఇష్టం ఉండదు. ఓటమి అంటే భయంతో అతను ఎప్పుడూ గెలుపు కోసం ప్రయత్నిస్తూ  బిజినెస్ లో దూసుకుపోతూంటాడు. తన తండ్రి చిన్నప్పుడు పదివేలు అప్పు తీర్చలేక తలవంచుకున్న క్షణాలు గుర్తు చేసుకుంటూ తనలో స్పూర్తి నింపుకుంటూంటాడు.అలా గెలుపు అనే మూడు అక్షరాలు చుట్టూ తిరుగుతున్న అతని జీవితం ఓ సర్పైజ్ పార్టీతో మారిపోతుంది.  

ఆ పార్టీలో తను చదువుకున్న  వైజాగ్ ఐఐఈటీ  ప్రొపెసర్ (రావు రమేష్) ని,  కాలేజీ మేట్స్ అందరినీ కలుస్తాడు. వారితో తన గత జ్ఞాపకాలు నెమరవేసుకుంటాడు. అయితే ఆ పార్టీకు తన జీవితంలో అత్యంత ముఖ్యలైన ఇద్దరు రాకపోవటం గమనిస్తాడు. వాళ్లలో ఒకరు తన మాజీ ప్రేయసి  (పూజా హెగ్డే), తన క్లోజ్ ఫ్రెండ్ రవి (అల్లరి నరేష్).  పూజ రాకపోవటానికి కారణం ...ఆమెతో అయిన బ్రేకప్ అని అర్దమవుతుంది. కానీ రవి ఎందుకు రాలేదనేది అర్దం కాదు.  అప్పుడు రవి గురించి ఓ  విషయం తెలుస్తుంది. అప్పుడు రవి కోసం  ఇండియా బయిలుదేరి వస్తాడు. 

రవి నివాసం ఉండే తూ.గో జిల్లాలో ని  రామవరం విలేజ్ కు వెళ్తాడు. అక్కడ కు వెళ్లాక జరిగిన  కొన్ని సంఘటనలతో రుషి అక్కడే కొంతకాలం ఉండిపోవాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఆ క్రమంలో అతను రైతు గా మారతాడు.. పెద్ద కార్పోరేట్ సంస్ద యజమాని వివేక్ మిట్టల్ (జగపతిబాబు)తో తలపడతాడు. అసలు రవి ఎందుకు ఆ పార్టీకు రాలేదు. రుషి తన వ్యాపారాలన్నిటికి అర్జెంటుగా శెలవు పెట్టి ఆ విలేజ్ కు ఎందుకు వెళ్లాడు. అసలు ఆ విలేజ్ లో ఏం జరుగుతోంది. రైతుగా  మారాల్సిన పరిస్దితి అపరకోటీశ్వరుడైన రిషికు ఎందుకు వచ్చింది, రిషికు అతని గర్ల్ ప్రెండ్ పూజకు మధ్య బ్రేకప్ కు కారణం ఏమిటి..రవి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. 

 

కథ, కథనం..

ఈ సినిమా కథని రకరకాల ఎలిమెంట్స్ అనుకుని వాటిని కూర్చుకుంటూ చేసినట్లుగా అర్దమవుతుంది. ఫస్టాఫ్ మొత్తం కాలేజీ బ్యాక్ డ్రాప్, సెకండాఫ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ గా విడగొట్టారు. అంతవరకూ విజువల్ గా డిఫరెన్స్ కనపడుతూ బాగుంది.  అయితే మహేష్ బాబు జ్ఞాపకాలుగా వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఫస్టాఫ్ మొత్తం పెట్టాల్సినంత కంటెంట్ లేదనిపిస్తుంది. దాంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు.   సెకండాఫ్ విలేజ్ లోకి వచ్చాకే అసలు కథ. అయితే అల్లరి నరేష్ తో ఎంత అనుబంధం ఉంటే..సెకండాఫ్ లో వచ్చే సీన్స్ అంతలా పండుతాయని వాటిని పెంచుకుంటూ పోయినట్లున్నారు. వాటిని తగ్గించి ఉంటే చాలా ఎక్కువ సేపు సినిమా చూసినట్లు అనిపించేది కాదు. 

అలాగే సెకండాఫ్ దాకా ఈ సినిమా అసలు సమస్యలోకి ప్రవేశించదు. అంటే విలేజ్ లో ఉన్న సమస్య..దాని పరిష్కారమే సినిమా అనుకున్నప్పుడు ...ఆ సమస్య కు సంభందం లేకుండా ఫస్టాఫ్ జరుగుతుంది. ఎందుకంటే విలన్ కూడా సెకండాఫ్ లో వస్తాడు.  ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్ తగ్గి..మినిమం ఇంటర్వెల్ కు అయినా కథలో కాంప్లిక్ట్ (విలన్ తో) అనేది వచ్చి ఉంటే కథనం పరుగెట్టేది.

గెలుపు అంటే కేవలం డబ్బు సంపాదన, కెరీర్ లో ఎదుగుదలే అనుకునే రుషి..అవి కాదు సక్సెస్ కొలమానాలు అని తెలుసుకోవటమే అనేదే స్టోరీ లైన్ అనుకుని ఈ స్క్రీన్ ప్లే చేసినట్లున్నారు. కానీ అది కథనంలో పెద్దగా రిప్లెక్ట్ కాలేదు.  దాంతో ఇది హీరో,విలన్...ఓ సామాజిక సమస్య  కథగానే కనిపించటంలో వింతఏమీ లేదు. అలాగే ఫస్టాఫ్ కాలేజ్ సీన్స్ చూస్తూంటే ‘త్రీ ఈడియ‌ట్స్’‌ సినిమా గుర్తుకు వస్తే మన తప్పు కాదు.  ‘త్రీ ఈడియ‌ట్స్’‌ముందు వచ్చేయటం కారణం అయ్యిండవచ్చు. 

 

మెయిన్ హైలెట్..

రైతుల ఆత్మహత్యలను, వాటి వెనక ఉన్న కారణాలను చెప్తే డాక్యుమెంటరీ అయ్యిపోతుంది..అందులోనూ మనందరికీ తెలుసున్న విషయమే కదా అని చాలా మంది టచ్ చేయటానికి ఇష్టపడరు. కానీ ఈ సినిమాలో అదే పాయింట్ ని ధైర్యంగా ఎత్తుకున్నారు అందుకు దర్శక,నిర్మాతలను అభినందించాల్సిందే. 

అయితే రైతులు ఆత్మ హత్యలు అనే  పాయింట్ కు గ్యాస్ పైప్ లైన్స్ ..కార్పోరేట్ విలన్స్ అంటూ తీసుకురావటమే సరిగ్గా కలవలేదనిపిస్తుంది. సమస్య..రైతులకు గిట్టుబాటు దొరకటం లేదు..రైతుకు సరైన విలవ సమాజం ఇవ్వటం లేదు అని చెప్పటమా లేక కార్పోరేట్ సంస్దలు ..పల్లెటూళ్లను ఆక్రమించి రైతుకు అన్యాయం చేస్తున్నాయని చెప్పటమా అనేది స్పష్టత ఇవ్వలేదు. ఏదో ఒకటి తీసుకుని స్పష్టంగా చెప్తే బాగుండేది.  

 

ప్రధాన ఇబ్బంది..

ఈ సినిమాకు లెంగ్త్ ఎక్కువ కావటంతో  టైట్ గా కథ నడవదు. చాలా చోట్ల స్లోగా, ప్లాట్ అయ్యిపోయిన ఫీలింగ్ వస్తుంది. మూడు గంటలను సినిమాలో దాదాపు అరగంట వరకూ ట్రిమ్ చేయచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లాగ్ లో చాలా మంచి ఎమోషన్స్ కూడా బోర్ కొట్టే అవకాసం ఉంటుంది. 

 

శ్రీమంతుడుతో పోలిక..

ఈ సినిమాకు ..మొదటి నుంచి మహేష్ సూపర్ హిట్ శ్రీమంతుడుతో పోలిక చేస్తూ ప్రచారం జరిగింది కానీ అమెరికానుంచి విలేజ్ కు రావటం అనే విషయం తప్పిస్తే ఎక్కడా   కలవదు. ఇది డిఫరెంట్ ఎప్రోచ్.

 

మహేష్ ఎలా చేసాడంటే..

సీఈవో గా, స్టూడెంట్ గా, రైతు గా మహేష్ వేరియేషన్స్ చూపించాడు. నటుడుగా ప్రత్యేకంగా మాట్లాడుకునే స్దాయి ఎప్పుడో దాటేసారు.   స్టూడెంట్ గా సూపర్ ఈజ్ తో తన ఏజ్ ని  గమనించనివ్వకుండా చేయటం అంటే మామూలు విషయం కాదు. 

 

నరేష్ కు ‘గమ్యం’ స్దాయి కాదు కానీ..

కామెడీ సినిమాలు చేసుకునే అల్లరి నరేష్ తన రూట్ మార్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో చేసాడంటే...ఎంతో గొప్ప పాత్ర అయి ఉండాలని ఆశిస్తాం. కథని మలుపు తిప్పే పాత్రే నరేష్ ది. కాకపోతే నరేష్ పాత్ర మరింత ఎమోషనల్ డెప్త్ కావాలనిపిస్తుంది. పెద్ద ఇనుప పెట్టె పట్టుకుని  ఐఐఈటీ కు రావటం,రూమ్ లో గుగ్గిలం పొగవెయ్యటం వంటి అంశాలు నవ్వు వస్తుంది. ఈ రోజుల్లో అందునా అంత పెద్ద  కోర్స్ చేద్దామని వచ్చేవాడు అంత అమాయకండా ఉంటాడా అనిపిస్తుంది. అయితే నరేష్ మాత్రం తన పాత్రకు వంద శాతం న్యాయం చేసారు. ‘గమ్యం’లో గాలిశీను  స్దాయి కాదు కానీ శంభో శివ శంభో నాటి నటుడుని గుర్తు చేసాడు.  

 

జగపతిబాబు, పూజ హెడ్గే, పోసాని...

జగపతిబాబు ఈ సినిమాలో మరోసారి కార్పోరేజ్ విలనిజంతో చెలరేగిపోయారు. పోసాని ఎప్పటిలాగే చేసారు. పూజ హేడ్గె ఈ సినిమాలో అప్పుడప్పుడూ మెరిసే ఓ మెరుపు. 

 

ఎమోషన్ ఎక్కువ..ఎంటర్టైన్మెంట్ తక్కువ..

పూర్తిగా సీరియస్ గా నడిచే ఈ సినిమాలో కొద్దో గొప్పో రిలీఫ్ ఫస్టాఫ్ లో దొరుకుతుంది కానీ సెకండాఫ్ లో అదీ ఇవ్వరు. ఫన్ కి కానీ  వేరే ఎంటర్టైన్మెంట్ అంశాలకు కానీ లేకుండా నడిపారు. 

 

టెక్నికల్ గా..

దర్శకుడుగా వంశీ పైడిపల్లి ఎప్పుడూ టెక్నికల్ గా హైస్టాండెర్డ్స్ లో నే ఉంటూ వస్తున్నారు. పక్కా కమర్షియల్స్ తీస్తూ వచ్చిన ఆయన ఊపిరితో  రూట్ మార్చారు. ఎమోషనల్ కంటెంట్ ని  పట్టుకుంటున్నారని అర్దమవుతుంది. అదీ ఈ సినిమాలో స్పష్పంగా కనపడుతుంది. 

ఈ సినిమాకు   బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ కుదిరినట్లుగా పాటలు కుదరలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. లెంగ్త్, లాగ్ ల  విషయంలో ఎడిటర్ ని తిట్టుకోకతప్పదు. సెకండాఫ్ మొత్తం విలేజ్ లో , చెట్లు క్రింద నడిచేటప్పుడు వంద కోట్ల బడ్జెట్ అయ్యిందా అనే డౌట్ వస్తుంది. డైలాగులు బాగున్నాయి. అయితే అవి కొన్ని చోట్ల స్పీచ్ లుగా, కొటేషన్స్ గానూ మారిపోయాయి.

 

ఫైనల్ థాట్..

రైతులు ధియోటర్ కు వచ్చి ఈ సినిమా చూస్తే అసలైన విజయం సాధించినట్లు. అందుకోసం ఏదైనా ఏర్పాటు సినిమా టీమ్ చేస్తే బాగుంటుంది. 

Rating: 3/5

ఎవరెవరు..

నటీనటులు: మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, జగపతిబాబు, పూజ హెగ్డే, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌

కథ: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌

నిర్మాత: దిల్‌ రాజు, సి. అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి 

దర్శకత్వం: వంశీ పైడిపల్లి

విడుదల తేదీ: 09-05-2019

మహర్షి: యూఎస్ ప్రీమియర్ షో టాక్

'మహర్షి' ట్విటర్ రివ్యూ..!

 

Follow Us:
Download App:
  • android
  • ios