Asianet News TeluguAsianet News Telugu

కరోనా ‘కష్ట కాలం’:బయటికి వెళ్తే ప్రజారవాణా కంటే సొంత వాహనమే బెస్ట్..

కరోనా కష్టకాలంలో భారతీయులు ప్రజారవాణాకు దూరం కానున్నారు. అత్యవసరమైతే తప్ప అలాగే క్యాబ్ లు, ఆటోల్లోనూ ఎక్కేందుకు సిద్ధం కావడం లేదు. సొంత వాహనం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

Citizens priority go to on own vehicle amid Covid-19 fear
Author
Hyderabad, First Published Jun 12, 2020, 11:10 AM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అటు సంఘ జీవనంలో, ఇటు వ్యక్తిగత జీవనంలో పలు మార్పులకు దారి తీసింది. ఎక్కడకెళ్లినా భౌతికదూరం తప్పనిసరైంది. ఏది ముట్టుకుంటే ఏమవుతుందో.. ఎటువైపు నుంచి వైరస్‌ తగులుకుంటుందోనన్న భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. 

ఈ క్రమంలో ఎవరూ ప్రయాణాలకు సాహసించలేకపోతున్నారు. అందుకే చాలామంది సొంత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన తాజా సర్వేలో 74 శాతం మంది లాక్‌డౌన్‌ తర్వాత వాహనాల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. 

దేశవ్యాప్తంగా 1,100 మందికిపైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 74 శాతం మంది సొంత వాహనాలు కొనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇందులో 57 శాతం మంది తొలిసారిగా వాహన కొనుగోళ్లకు వెళ్తున్నవారే 

వీరంతా ప్రీ-ఓన్డ్‌ వాహనాలపట్ల ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న కార్లను ఆధునికీకరించుకోవాలన్న అభిప్రాయాలూ పెద్ద ఎత్తునే వ్యక్తమయ్యాయి. అయితే, వాహన కొనుగోళ్లకు ఆర్థిక సమస్యలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. 26 శాతం మందికి ఇప్పుడిదే సమస్య.

దీంతో వాహన కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు వారు చెప్తున్నారు. ఇక 37 శాతం మంది హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో కార్లను కొనాలని ఆశ పడుతుండగా, 29 శాతం మంది సెడాన్‌, ఎస్‌యూవీలపట్ల ఇష్టం చూపుతున్నారు. కాగా, 56 శాతం మంది తాము కొనుగోలు చేసే వాహనాలను సొంత అవసరాలకే వినియోగిస్తామని చెప్తున్నారు. 

57 శాతం మంది మాత్రం క్యాబ్‌ సర్వీసులుగా మారుస్తామని అంటున్నారు. ఏదిఏమైనా కొత్త కార్లు, పాత కార్లకు ఇప్పుడు డిమాండ్‌ కనిపిస్తున్నదని ఈవై ఇండియా పార్ట్‌నర్‌ అండ్‌ ఆటోమోటివ్‌ రంగ అధిపతి వినయ్‌ రఘునాథ్‌ తెలిపారు.

ఒకవేళ లాక్ డౌన్ నిబంధనలు సడలించి ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చినా సిటిజన్స్ వాటిపై ఇంట్రెస్ట్ చూపే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులు, మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ స్టార్ట్ కాకపోవడంతో క్యాబ్స్, ఆటోలకు డిమాండ్ ఉంటుందని అంతా అనుకున్నారు. 

also read లాక్ డౌన్ ఎఫెక్ట్: సెకండ్ హ్యాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్...

క్యాబ్స్, ఆటోలు, బైక్​ టాక్సీలు సేఫ్టీ ప్రికాషన్స్‌తో రోడ్లపైకి వచ్చేసినా, బుకింగ్స్​ మాత్రం అంతగా ఉండడం లేదు. ఎమర్జెన్సీ అయితే తప్ప జనం వాటిని యూజ్ చేయడం లేదు. చాలామంది ఓన్ వెహికల్స్​తోనే బయటికి వస్తున్నారు.  సొంత వెహికల్ లేనివాళ్లు క్యాబ్​లో సింగిల్ బుకింగ్ చేసుకుంటున్నారు. షేరింగ్​ జోలికి మాత్రం వెళ్లడం లేదు.

క్యాబ్ సంస్థలు సేఫ్టీ ప్రికాషన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయించినా తెలియని వారితో ట్రావెల్ చేయడం రిస్క్ అనే ఫీలింగ్ పౌరుల్లో ఏర్పడింది. ఆటోలో ఇద్దరు, క్యాబ్​లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరు జర్నీ చేసే చాన్స్​ ఉన్నా, సింగిల్ బుకింగే బెటర్​ అనుకుంటున్నారు. 

ఆటోలకు పెద్దగా గిరాకీ ఉండడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. కార్, బైక్​.. ఇలా తమ వెహికల్​నే ఎక్కువగా వాడుతున్నామని.. దగ్గర్లో పనులుంటే నడిచే వెళ్తున్నామని సిటిజన్స్ చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్​పోర్టేషన్ మొదలైనా వాటిల్లోనూ ఇప్పట్లో జర్నీ చేయడం కష్టమేనంటున్నారు.

2016–-17లో సిటీలో 45వేలకు పైగా తిరిగే క్యాబ్స్ సంఖ్య  క్రమంగా  తగ్గుతూ వచ్చింది. లాక్ డౌన్​కు ముందు సిటీలో 15వేలకు పైగా నడిచేవి. తక్కువ చార్జీతో ట్రాఫిక్​ ఇబ్బందుల్లేకుండా వెళ్లేలా రెంటల్, బైక్​ ట్యాక్సీలు రావడంతో ఎక్కువమంది వాటినే ప్రిఫర్ చేస్తూ వచ్చారు. 

ప్రస్తుతం సిటీవ్యాప్తంగా 5 వేల క్యాబ్స్ కూడా తిరగడం లేదు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు కారును శానిటైజ్ చేయడంతోపాటు మాస్క్, గ్లౌస్ వాడుతున్నారు. ప్యాసింజర్స్​కూ మాస్క్ తప్పనిసరి చేశారు. అయినా ఒక్కో క్యాబ్​కి రోజులో 3–5 బుకింగ్స్ మాత్రమే వస్తున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ శివ తెలిపారు. 


బుకింగ్స్ లొకేషన్ కూడా 5 నుంచి 6 కి.మీ  దూరం ఉంటోందన్నారు. డ్రైవర్ ప్యాసింజర్ దగ్గరకు వెళ్లేందుకు 20–30 నిమిషాలు, తిరిగి లొకేషన్​లో డ్రాప్ చేసేందుకు మరో 30 నిమిషాలు.. ఇలా గంటకుపైగా టైం పడుతోందని తెలిపారు. బుకింగ్ లోకేషన్ దూరంగా ఉండటం వల్ల పికప్, డ్రాపింగ్ ఎక్కువ టైం, డీజిల్ వేస్ట్ అవుతోందని, చార్జీ మాత్రం అంతే ఉంటుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios