Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ మాఫియాలో ఆ పెద్దతలకాయలు... ఎన్ఐఎ దర్యాప్తులో బట్టబయలు: ధూళిపాళ్ల సంచలనం

విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో 21వేల కోట్లరూపాయల హెరాయిన్ ఇండియాకు దిగుమతి అయ్యిందని... ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో పెద్దతలకాయల బండారం బయటపడుతుందని టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల సంచలన కామెంట్స్ చేసారు. 

big names in drugs smuggling case... dhulipalla narendra sensational comments
Author
Guntur, First Published Oct 13, 2021, 3:44 PM IST

అమరావతి: డ్రగ్ మాఫియాతో ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధం లేకపోతే ఎన్ఐఎ టీమ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? అని టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ఐఎ అధికారులు విజయవాడలో తనిఖీలు నిర్వహించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిందని బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని... కానీ ఎన్ఐఎ దర్యాప్తు పూర్తయితే పెద్దతలకాయల బండారం బట్టబయలవుతుందని ధూళిపాళ్ల సంచలన కామెంట్స్ చేసారు.

''విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ కాందహార్ లో గల హసన్ హుసేన్ సంస్థ  నుంచి దిగుమతి అయిన 21వేల కోట్లరూపాయల  heroin కు సంబంధించిన కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి ప్రభుత్వం తమ బ్లూమీడియా ద్వారా ఆ డ్రగ్స్ తో రాష్ట్రానికి సంబంధం లేదని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు'' అని dhulipalla narendra ఆరోపించారు. 

''డ్రగ్స్ కు సంబధించిన వార్తలు పత్రికల్లో వచ్చిన 24గంటల తర్వాత AP DGP, Vijayawada పోలీస్ కమిషనర్ ఎటువంటి విచారణ జరపకుండానే సంబంధిత సరుకుతో విజయవాడకు సంబంధం లేదంటున్నారు. కేవలం లైసెన్సు మాత్రమే వాడుకున్నారని ఏవిధంగా క్లీన్ చిట్ ఇస్తారు?'' అని ప్రశ్నించారు.

READ MORE  డ్రగ్స్ అక్రమ రవాణా కేసు... టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు పోలీస్ నోటీసులు

''గత నెల 13వతేదీన గుజరాత్ లోని ముంద్రా పోర్టులో ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో వచ్చిన రెండు కంటైనర్లలో 21వేల కోట్లరూపాయల విలువైన 3టన్నుల హెరాయిన్ పట్టుబడింది. అయితే ఆషీ ట్రేడింగ్ కంపెనీతో గత ఏడాది కాలంలో కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆ సంస్థ పేరుతో జిఎస్ టి రిటర్న్స్ సమర్పించిన మాట వాస్తవం కాదా?  జూన్ లో ఇదే కంపెనీ పేరుతో 1.75లక్షల కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి అయినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. వీటన్నింటిపై ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ దర్యాప్తు జరుపుతోంది'' అన్నారు. 

''దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన డ్రగ్ మాఫియాలో ఉన్నవారు ఎవరైనా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఎన్ఐఎ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన హెరాయిన్ కు సంబంధించి విజయవాడతో పాటు చెన్నయ్, కోయంబత్తూరు, డిల్లీ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సోదాలు నిర్వహించామని...ఈ తనిఖీల్లో పలు కీలకపత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని... విచారణ కొనసాగుతోందని తెలిపింది'' అని పేర్కొన్నారు. 

''వాస్తవాలను మరుగునపర్చి రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ, ఎన్ఐఎ క్లీన్ చిట్ ఇచ్చిందని గోబెల్స్ ప్రచారం చేసుకోవడంవల్ల తాత్కాలికంగా వారు సంతృప్తి చెందవచ్చు. కానీ నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. నిజానిజాలు వెలికితీసి డ్రగ్ మాఫియాలో ఉన్న పెద్దతలకాయలు ఎంతటివారైనా బయటకు తీసి వారి నిజస్వరూపాన్ని దేశప్రజలకు వెల్లడించాల్సిందిగా ఎన్ఐఎ కు తెలుగుదేశం పార్టీ విజ్జప్తి చేస్తోంది'' అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios