68 వేల మంది భారతీయులకు హెచ్1బీ గండం : దొరికితే అమెరికాలోనే.. లేదంటే ఇంటికే

By Siva KodatiFirst Published Feb 18, 2020, 3:14 PM IST
Highlights

అగ్రరాజ్యంలో ఉన్నత విద్య పూర్తి చేసి అప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) అర్హతతో ఉద్యోగం చేస్తున్న దాదాపు 68 వేల మంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కఠిన పరీక్షను ఎదుర్కొనున్నారు. 

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది భారతీయుల అమెరికా కలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

తాజాగా అగ్రరాజ్యంలో ఉన్నత విద్య పూర్తి చేసి అప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) అర్హతతో ఉద్యోగం చేస్తున్న దాదాపు 68 వేల మంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కఠిన పరీక్షను ఎదుర్కొనున్నారు.

మూడేళ్ల కాలవ్యవధి పరిమితితో ఇచ్చే ఈ ఓపీటీ ఈ ఏడాదితో పూర్తి కానుండటమే భారతీయుల భయానికి కారణం. ఇప్పటికే రెండు సార్లు హెచ్1బీ వీసా అవకాశం కోల్పోయిన వీరికి ఈ ఏప్రిల్‌లో చివరి అవకాశం.

Also Read:అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు షాక్: అక్టోబర్ 1 నుండి ఇంటికే

ఈసారి కూడా వీసా రాకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లడం లేదా మళ్లీ ఏదైనా యూనివర్సిటీలో పీహెచ్‌డీలో చేరడం. లేదా ఎంఎస్‌లో మరో కోర్సు చేయడమే మార్గం. ఈ సాఫ్ట్‌వేర్ జీవుల్లో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తిరిగి ఎంఎస్‌లో చేరడానికి  ఇష్టపడటం లేదు.. ఒకవేళ వీసా రాకపోతే భారత్‌కు వెళ్లడం తప్పించి మరో మార్గం లేదు.

2015-16లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లినవారు ఇప్పుడు వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్, ఐటీ సేవల విభాగంలో పనిచేసే వారికి అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తోంది.

అయితే భారత్ నుంచి ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లి ఆపైన హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి సంఖ్య నాలుగేళ్ల క్రితమే లక్ష దాటింది. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్య 2 లక్షలు దాటుతుందని అంచనా.

Also Read:నా దారి రహదారి అంటే కుదర్దు: హెచ్1బీపై పేచీతో మనకే నష్టం.. ట్రంప్‌కు సీఈఓల లేఖ

భారత్‌కు వెళ్లడం ఇష్టంలేని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు హెచ్1బీ వీసా కలిగిన ఉన్నవారిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని భారత్‌లోని తమ తల్లిదండ్రులకు చెబుతున్నారు.. హెచ్1బీ వీసా ఉంటే వెంటనే సంబంధం ఓకే చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు.

హెచ్1బీ వీసా కలిగి ఉండి (గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్‌లో ఉంటే) జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. ఇక ఓపీటీ గడువు దాటుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉంటారని అంచనా. 

click me!