ఫోన్ల ధరలు పెరుగనున్నాయి...ప్రత్యేకించి ఆపిల్ ‘ఐఫోన్’ కూడా....

By Sandra Ashok KumarFirst Published Feb 6, 2020, 10:58 AM IST
Highlights

మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకం విధించడంతో వచ్చే ఏడాది ఫోన్ల ధరలు రెండు నుంచి ఏడు శాతం పెరుగనున్నాయి. అయితే 97 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్న ద్రుష్ట్యా సుంకాల ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. దిగుమతి చేసుకునే హై ఎండ్ ఫోన్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉండొచ్చు.


ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ధరలు ప్రియం కానున్నాయి. ఈ నెల ఒకటో తేదీన పార్లమెంట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దిగుమతి చేసుకునే ఫినిష్డ్ ఉత్పత్తుల దిగుమతులపై పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని వల్ల మొబైల్ ఫోన్ల ధరలు రెండు నుంచి ఏడు శాతం పెరిగే అవకాశం ఉన్నదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

పూర్తి స్థాయిలో తయారు చేసిన మొబైల్ ఫోన్ల దిగుమతులు భారతదేశంలో తక్కువగా ఉండటం గమనార్హం. ఫోన్లను తయారు చేయడంలో వినియోగించే కొన్ని విడి భాగాల దిగుమతి చేసుకోవడం వల్ల వాటిపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కనుక ధరల పెరుగుదల తప్పక పోవచ్చునని తెలుస్తున్నది.

also read ఫోన్‌పేలోకి అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్‌...

బడ్జెట్లో చార్జర్ల దిగుమతిపై సుంకం 15 నుంచి 20 శాతానికి, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీఏ)పై పది శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు చేశారు. మరికొన్ని విడి భాగాలపై ఇదే తరహాలో దిగుమతి సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

తాజాగా ఫీచర్ మొబైల్ ఫోన్ల విడి భాగాల్లో పీసీబీఏ దిగుమతిపై సుంకం ఆరు శాతం అని, తాజాగా కేంద్రం ఆ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల సెగ్మెంట్ పై ప్రభావం పడే అవకాశం ఉన్నదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించడానికే ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ఫోన్లలో 97 శాతం భారతదేశంలోనే తయారు అవుతున్నాయి. కొన్ని విడి భాగాలను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కేవలం రూ.40 వేలపై చిలుకు ధర గల ఫోన్లలో కొన్ని మాత్రమే విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రత్యేకించి ఆపిల్  ‘ఐఫోన్’ కూడా కొన్ని మోడళ్లను భారతదేశంలోనే తయారు చేస్తుండటం గమనార్హం. 

కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల కనీసం మొబైల్ ఫోన్ల ధరలు 4 నుంచి ఏడు శాతం పెరుగుతాయని టెక్ అనలిస్ట్ సంస్థ ఏఆర్సీ చీఫ్ అనలిస్ట్ కం ఫౌండర్ ఫైసల్ కవూసా అంచనా వేశారు. స్మార్ట్ ఫోన్ల తయారీలో లోతుగా వెళ్లినా కస్టమ్స్ సుంకానికి అనుగుణంగా ధరలు పెరుగుతాయన్నారు. లేనిపక్షంలో స్థానికంగా తయారు చేయడానికి కేంద్రం రాయితీలు కల్పిస్తోంది. 

also read కరోనావైరస్ కారణంగా తగ్గుతున్న ఐఫోన్ ఉత్పత్తి....

భారతదేశంలోకి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు మూడు నుంచి 3.5 శాతం ఉంటాయని ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రో తెలిపారు. ఇప్పటికే సుంకాల భారం వల్ల ఫోన్లు గ్రే మార్కెట్ కు తరలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీబీఏ డ్యూటీ 20 శాతం పెంచడం వల్ల ఫీచర్ ఫోన్ల ధరలపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఫీచర్ ఫోన్లలో కనీసం ఆరు శాతం పీసీబీఏ వినియోగం ఉన్నదని, కొన్ని నెలల్లో ఈ మార్కెట్ మొత్తం భారతదేశంలోకి మళ్లుతుందని పంకజ్ మొహింద్రో చెప్పారు. 

ప్రస్తుతానికి 97 శాతం ఫోన్లు దేశీయ మార్కెట్లో తయారవుతున్నాయి. హై ఎండ్ ఫోన్ల ధరలు రూ.40 వేలు, ఆ పై చిలుకు ధర పలికితే అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. గూగుల్ పిక్సెల్ వంటి ఫోన్లు హై ఎండ్ ఫోన్లు దిగుమతి అవుతున్నాయి. చైనా, వియత్నాంల నుంచి తక్కువ ధర ఫోన్ల తయారీ, విక్రయాలకు పోటీ వస్తోంది. 

click me!