6 నెలలు దాటితే కష్టమే: స్టార్టప్‌లపై తేల్చేసిన క్రిష్ గోపాలక్రిష్ణన్

By Sandra Ashok KumarFirst Published May 11, 2020, 11:53 AM IST
Highlights

కరోనా వైరస్​ ఎక్కువ రోజులు ఉంటే దేశంలోని 25శాతం స్టార్టప్ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, సీఐఐ మాజీ అధ్యక్షుడు గోపాల క్రిష్ణన్​ అభిప్రాయపడ్డారు. ఆరు నెలలు దాటితే మిగతా సంస్థల భవితవ్యం కూడా ప్రశ్నార్థకమేనన్నారు. అదనంగా పెట్టుబడులు వస్తేనే వీటిలోని కొన్ని స్టార్టప్ సంస్థలు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉన్నదన్నారు.

బెంగళూరు: కరోనా వైరస్​ మహమ్మారితో భారత్​ లాక్​డౌన్​లోకి జారుకుంది. అనేక కార్యకలాపాలు మూతపడ్డాయి. అయితే వైరస్​ ప్రభావం ఎక్కువ కాలం ఉంటే.. దేశంలోని 25శాతం స్టార్టప్ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు, కాన్ఫిడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ (సీఐఐ) మాజీ అధ్యక్షుడు క్రిష్ గోపాల క్రిష్ణన్​ పేర్కొన్నారు.

‘ఆరు నెలల కాలంలో ఆర్థిక పునరుత్తేజం సాకారం కాకపోతే 25శాతం స్టార్టప్ సంస్థలు ప్రమాదంలో పడతాయని అనుకుంటున్నా. వారు కోలుకోవడానికి 6 నెలల సమయమే ఉంది. ఈ పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అనిపిస్తోంది’ అని క్రిష్ గోపాలక్రిష్టన్ వెల్లడించారు.

‘అదనపు పెట్టుబడులు అందితే ఈ సంస్థలు ఊపిరి పీల్చుకోవచ్చు. లేకపోతే విఫలమయినట్టే. పెట్టుబడులు అందినా కొన్ని కోలుకోవడం కష్టమే’ అని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు, కాన్ఫిడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ (సీఐఐ) మాజీ అధ్యక్షుడు క్రిష్ గోపాల క్రిష్ణన్​ వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్​ ప్రభావం ఎక్కువ కాలం ఉంటే... మిగిలిన 75శాతం స్టార్టప్ సంస్థలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని క్రిష్ గోపాలక్రిష్టన్ అభిప్రాయ పడ్డారు. బ్యాంకులు, ప్రభుత్వం, పెట్టుబడిదారులు వీరికి సహాయం చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. అయితే తమ వద్ద ఉన్న వనరులను స్టార్టప్ సంస్థలు వివిధ రకాలుగా ఉపయోగించుకోవాలని క్రిష్ గోపాలక్రిష్టన్ వెల్లడించారు. 

also read లాక్‌డౌన్ ఎఫెక్ట్: సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం కొత్త స్కీమ్

‘ఈ-కామర్స్​ సేవలు కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఫుడ్​ డెలివరీలు కూడా జరుగుతున్నాయి. రవాణాపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో ప్యాసింజర్లు వినియోగించని ట్యాక్సీలను ఈ ఫుడ్​ డెలివరీ కోసం, సరకు రవాణా కోసం వినియోగించాలి’ అని గోపాలక్రిష్టన్ పేర్కొన్నారు.  

రవాణా రంగంలోని స్టార్టప్ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆశిస్తున్నట్టు ఈ-కామర్స్​ అండ్​ కన్జ్యూమర్​ ఇంటర్నెట్​ భాగస్వామి అంకుర్​ పాహ్వ పేర్కొన్నారు. అయితే పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యమివ్వాలని తెలిపారు.

బిజినెస్​ టు కన్జ్యూమర్​ కంపెనీలకు డిమాండ్​ పెరగాలంటే కొంత కాలం వేచి చూడాలని అంకుర్ అభిప్రాయపడ్డారు​. వినియోగదారుల విచక్షణా వ్యయం పెరిగితేనే బీ2సీ కంపెనీల కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. నగరాలతోపాటు పెద్ద, చిన్న పట్టణాల్లోనూ గిరాకీ పెరగాల్సి ఉన్నదని తెలిపారు. సరఫరా గిరాకీ పెరగడం కూడా ముఖ్యమేనని చెప్పారు.
 

click me!