కరోనా వైరస్‌ వ్యాక్సిన్... హైదరాబాదీ భారత్ బయోటెక్‌కు నిధులు...

By Sandra Ashok KumarFirst Published Apr 21, 2020, 11:52 AM IST
Highlights

కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు అవసరమైన వ్యాక్సిన్​ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని 3 కంపెనీలను ఎంపిక చేసింది. వైరస్‌పై యుద్ధానికి అవసరమైన డయాగ్నస్టిక్స్‌, థెరపాటిక్స్‌, ఇతరత్రా వసతులను రూపొందించేందుకు ముందుకు వచ్చిన 13 ప్రతిపాదనలకూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ (డీబీటీ) ఆమోదం తెలిపింది. వాటికి కూడా కేంద్రం నిధులు సమకూర్చనుంది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ఆట కట్టించేందుకు అవసరమైన వ్యాక్సిన్‌ రూపకల్పనలో ఓ అడుగు ముందుకు పడింది. ఆ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగం నిధులివ్వనుంది. ఇందుకోసం 3 కంపెనీలను ఎంపిక చేసింది. 

వ్యాక్సిన్ డెవలప్ చేసేందుకు కేంద్రం నుంచి నిధులు పొందనున్న కంపెనీల్లో కేడిలా హెల్త్‌కేర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఉన్నాయి. 

కరోనా వైరస్‌పై యుద్ధానికి అవసరమైన డయాగ్నస్టిక్స్‌, థెరపాటిక్స్‌, ఇతరత్రా వసతులను తయారు చేసేందుకు వచ్చిన 13 ప్రతిపాదనలకూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ) ఆమోదం తెలిపింది. అంటే వీటికి సైతం నిధుల సహాయం లభిస్తుంది. 

also read చరిత్రలోనే తొలిసారి అత్యంత కనిష్ఠ స్థాయికి క్రూడ్ ధరలు...

నేషనల్‌ బయోఫార్మా మిషన్‌ నుంచి నిధులను అందించి, ఒక పరిశోధనా కన్సార్షియం ద్వారా వివిధ దశల్లో వీటి అభివృద్ధిని పరిశీలించనున్నట్లు డీబీటీ తెలిపింది. కొవిడ్‌-19 రీసెర్చ్‌ కన్సార్షియం కింద దరఖాస్తులను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెట్స్‌ కౌన్సిల్‌ ఆహ్వానించాయి. 

తొలి దశలో గత నెల 30లోగా 500 దరఖాస్తులు అందాయని డీబీటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్‌యాక్టివేటెడ్‌ రేబిస్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవడం ద్వారా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సిద్ధం చేయడానికి భారత్‌ బయోటెక్‌కు నిధులు అందించనున్నట్లు తెలిపింది. 

అదే సమయంలో డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలని కేడిలా హెల్త్‌కేర్‌కు సిఫారసు చేసినట్లు వివరించింది. అధిక రిస్క్‌ ఉన్నవారికి బీసీజీ వ్యాక్సిన్‌ను రసాయనిక రీత్యా మళ్లీ కలపడం ద్వారా, ఫేజ్‌ 3 మానవ క్లినికల్‌ పరీక్షల అధ్యయనానికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సహకరిస్తుంది. మిగతా ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నట్లు డీబీటీ కార్యదర్శి రేణ స్వరూప్‌ తెలిపారు.
 

click me!