Budget 2020: ఆయన బడ్జెట్‌ స్పీచ్ దేశ గతినే మార్చేసింది...

By Sandra Ashok KumarFirst Published Jan 30, 2020, 10:16 AM IST
Highlights

2024 నాటికి భారతదేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముందుకు వెళుతున్నది. అయితే, అంతర్జాతీయంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరుకోవడంతో అహర్నిశలు దేశ అభ్యున్నతి కోసం ఓ ఆర్థిక వేత్త చేసిన క్రుషి దాగి ఉన్నది. అచేతనావస్థలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు ఆయన. ఆయనే మన్మోహన్ సింగ్. 1991-92లో చెల్లింపులకు రుణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్.. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు తెర తీసి విప్లవాత్మక మార్పులతో దేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించారు. నాడు ఆయన తొలి బడ్జెట్ ప్రసంగమే కార్పొరేట్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

న్యూఢిల్లీ‌: దేశం ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తెలుగు తేజం పీవీ నర్సింహారావు సారథ్యంలో 1991 జూన్ నెలలో కాంగ్రెస్ సర్కార్ కేంద్రం కొలువు దీరింది. కానీ నాడు చెల్లింపులకు బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అయితే, స్ఫూరద్రుపి పీవీ నర్సింహారావు తన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా రాజకీయ నాయకుడ్ని కాక పేరొందిన ఆర్థిక వేత్తను నియమించుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం వల్లే ఈనాడు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా గణనీయ పురోగతి సాధించింది. 

నాడు పీవీ నర్సింహారావు క్యాబినెట్‌లో డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికీ.. సామ్యవాద అజెండాతోనే ముందుకు సాగుతున్న మన ఆర్థిక వ్యవస్థలో అప్పులు స్థూల జాతీయోత్పత్తిలో 23శాతానికి చేరాయి. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థ రాజ్యమేలుతూ ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకు అడ్డంకిగా మారింది.

also read రతన్ టాటా పాదాలకు నమస్కరించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు

దీంతో పాటు పారిశ్రామిక రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కోవడంతో నిరుద్యోగం విలయ తాండవం చేసింది. రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణాలు వరుసగా 13, 17 శాతానికి చేరి కొండెక్కి కూర్చున్నాయి. విదేశీ మారక నిల్వలు రూ.2500 కోట్లతో అత్యంత కనిష్ఠ స్థాయికి చేరాయి. మరోవైపు రాజకీయ అస్థిరత నిప్పుకు ఉప్పులా తోడయింది. 

ఇలా దేశం పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సరిగ్గా ఈ తరుణంలో ఆర్థిక విధానాలపై అపార జ్ఞానం, అనుభవం ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. తాను ప్రవేశపెట్టబోయే తొలి 1991-92 బడ్జెట్‌లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 

ఓ రకంగా చెప్పాలంటే బడ్జెట్‌ ప్రవేశపెడుతూ నాడు మన్మోహన్‌ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రసంగం దేశ గతినే మార్చేసింది. ఎంపిక చేసిన పరిశ్రమల్లో విదేశీ యాజమాన్యానికి మెజారిటీ వాటాకు అనుమతిస్తూ మార్పులు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 20శాతం పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. వాటి స్థానంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. 

ఎరువులు, వంట గ్యాస్‌, పెట్రోల్‌ ధరల్ని పెంచారు. చక్కెరపై కల్పించిన రాయితీని ఎత్తివేశారు. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ పన్ను రాయితీలు ప్రకటించారు. మూలం వద్దే పన్ను వసూలు(టీడీఎస్‌) విధానానికి శ్రీకారం చుట్టారు. విదేశీ నిధులపై వచ్చే డివిడెండ్లపై విధించే పన్నుని భారీగా తగ్గించారు.

కార్పొరేట్‌ పన్నును 40శాతం నుంచి 45శాతానికి పెంచారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మ్యూచువల్‌ ఫండ్లలోకి ప్రైవేటు రంగ పెట్టుబడులను అనుమతించారు. ఈ నిర్ణయాలతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి తీసుకున్న రుణ చెల్లింపుపై ఆ సంస్థకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

వీటితోపాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిర్వహణపై చట్టబద్ధ అధికారాల్ని పూర్తిగా సెబీకి బదలాయిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 80హెచ్‌హెచ్‌సీ కింద ఇచ్చే పన్ను రాయితీని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు పెంచారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ రంగం ఆర్థికంగా నిలదొక్కుకొని దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి ఓ కారణమైంది.

ఇలా అనేక సంచలనాత్మక నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థని మన్మోహన్‌ సమూలంగా మార్చారు. విదేశీ పెట్టుబడులకు, కంపెనీలకు తలుపులు తెరిచి పారిశ్రామిక, సేవల రంగానికి ఊతం కల్పించారు. దీంతో ఉద్యోగాలు పెరిగి క్షేత్ర స్థాయిలో ప్రజల ఆర్థిక మూలాలు బలపడ్డాయి. 

దీనికి దన్నుగా సమాచార సాంకేతిక రంగం ఫలాలు అందడంతో దేశ ఆర్థికి పరిస్థితి తిరిగి గాడిన పడింది. ఇలా పలు ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలిపిన ఘనత మన్మోహన్‌ది.బ్రిటిష్ వలస పాలనలో చిక్కుకుని విలవిలలాడిన భారత్ తర్వాత కూడా సామ్యవాద విధానాలతోపాటు పాత పద్దతులనే కొనసాగిస్తూ వచ్చింది. కానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బడ్జెట్ రూపురేఖలు మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 

ఈనాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రూపాంతరం చెందిందంటే దాని వెనుక మన్మోహన్ సింగ్ మేధస్సు ఉన్నదనేది కాదనలేని నిజం. ప్రపంచంలోకెల్లా ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈనాడు పేరు తెచ్చుకున్నది. 

also read Budget 2020:పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు...

సామ్యవాద, లైసెన్స్ రాజ్ నుంచి విముక్తి పొందుతూ సంస్కరణల దిశగా అడుగులేసిన భారత్ ఆర్థిక వ్యవస్థలో 1991 తర్వాత సమూలమైన విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశాన్ని స్వేచ్ఛా మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఆర్థిక పరమైన అడ్డంకులను తొలిగించడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 

1991-92లో కేంద్రంలో వీపీ నర్సింహారావు సారథ్యంలో మైనారిటీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సంస్కరణల బాటను మన్మోహన్ సింగ్ వీడలేదు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టే నాటికి భారత్ రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొన్నది. రుణ సంక్షోభం పెరగడంతోపాటు అంతర్గతంగా దేశీయంగా ప్రభుత్వ రుణాలు పెరిగాయి. 

మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నా.. ఎంపిక చేసిన రంగాల్లో సంస్కరణలు తేవడానికి మన్మోహన్ సింగ్ వెరవలేదు. నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించి లైసెన్స్ రాజ్ కు తెర దించిన మన్మోహన్ సింగ్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితులే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రంలో కీలక స్థానాల్లో పని చేశారు కూడా. 
 

click me!