మోదీ సర్కార్ తొలి పూర్తిస్థాయి బడ్జెట్​పై భారీ అంచనాలు...

By Sandra Ashok KumarFirst Published Jan 24, 2020, 12:22 PM IST
Highlights

దేశీయ ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. మందగమనం వెంటాడుతోంది. ఎన్ని సంస్కరణలు అమలులోకి తెచ్చానా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. ఈ దశలో మలి విడుత మోదీ సర్కార్ ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్​పై భారీ అంచనాలే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడ్డ బీజేపీకి ఈ బడ్జెట్ ఎంతో కీలకం. మందగమనం నేపథ్యంలో ప్రజాకర్షణ మంత్రం జపించడానికి అవకాశముందా? ప్రభుత్వం ఎటువంటి సంస్కరణలు అమలు చేయనున్నదన్న విషయాన్ని పరిశీలిద్దాం.. 

న్యూఢిల్లీ: ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం తెచ్చే వార్షిక ఖర్చు, జమ వివరాల పత్రమే బడ్జెట్. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే సత్తా గల ఈ పద్దు​పై సాధారణంగానే ప్రజల దృష్టి ఉంటుంది. కానీ ఈసారి బడ్జెట్​కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మలి విడుత మోదీ సర్కార్ ప్రవేశపెడుతోన్న మొదటి పూర్తిస్థాయి బడ్జెట్​ ఇది. దీంతోపాటు ప్రస్తుత రాజకీయ, ఆర్థిక స్థితిగతులే ఇందుకు కారణం. వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న మోదీ సర్కార్‌కు ఈ బడ్జెట్ మరీ ముఖ్యం.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో లోక్‌సభ స్థానాలను గెలుచుకొని తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. లోక్​సభ సమరంలో సత్తా చాటిన బీజేపీ ప్రభావం తర్వాత  తగ్గుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో డీలా పడింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్​ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే మాజీ ఉప ప్రధాని దేవీలాల్ ముని మనుమడు సహకారంతో కేవలం హర్యానాలోనే అధికారాన్ని కాపాడుకోగలిగింది. 

also read  గ్రామీణులకు డైరెక్ట్ ఇన్సెంటివ్‌లు... నిర్మలా సీతారామన్‌....

హర్యానా ఎన్నికల ఫలితాలు, మహారాష్ట్రలో మారిన రాజకీయం, జార్ఖండ్ రాష్ట్రంలో మహా కూటమి సర్కార్ కొలువుదీరిన ఘటనలే ప్రజలను ఆకర్షించడానికి ఈ బడ్జెట్ ఎంత కీలకమో తెలియజేస్తున్నది. ఫిబ్రవరిలో డీల్లీ అసెంబ్లీకి. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 

వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ముఖ్యం. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్​సీ), జాతీయ జనాభా జాబితా (ఎన్​పీఆర్)​ వంటి వివాదాస్పద అంశాలపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు ఇలా పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు, మేధావుల ప్రచారాన్ని అధిగమిస్తూ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించేలా బడ్జెట్​లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవసరం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 2012-13 తర్వాత.. అత్యల్పంగా నమోదు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనితో పాటు ఇటీవల ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల గరిష్ఠాన్ని చేరింది. ప్రజల కొనుగోళ్లు తగ్గినందువల్ల పడిపోయిన వినియోగ డిమాండ్ ఇంకా గాడిలో పడలేదు. 

వీటితోపాటు పలు కారణాలతో జీడీపీ వృద్ధి క్షీణిస్తోంది. సార్వత్రిక పోరు తర్వాత లోక్​సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​ ప్రవేశపెట్టారు. అప్పటికే ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రారంభమైంది. ఆ బడ్జెట్​లో దేశార్థికాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వినిపించాయి. వీటికీ బదులిస్తూ కేంద్రం ఇటీవల కొన్ని సంస్కరణలు చేపట్టింది. 

సెప్టెంబర్​లో కార్పొరేట్ పన్ను తగ్గించటం కేంద్రం అమలులోకి తెచ్చిన సంస్కరణల్లో ప్రధానమైంది. దీనితో పాటు రూ. 102 లక్షల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన, రుణ లభ్యతను పెంచటం సహా స్థిరాస్తి రంగాలకు సంబంధించి వివిధ చర్యలు తీసుకుంది.

ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెడుతోన్న దృష్ట్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సర్కార్ మరిన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణులు ఆశిస్తున్నారు. ప్రజలకు ఖర్చు పెట్టేందుకు అందుబాటులో ఉండే డబ్బును పెంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఊతమివ్వొచ్చు. 

also read ‘2022 నాటికి అందరికి సొంతిల్లు’ ... కేంద్ర ఆర్థిక మంత్రి...

ఇందుకోసం ఆదాయం పన్నును తగ్గిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.గ్రామీణ వినియోగ డిమాండ్ ప్రస్తుతం పడిపోయింది. మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం బడ్జెట్​లో భారీగా నిధులు కేటాయిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్టాక్​మార్కెట్లలో పెట్టుబడిదారులపై వసూలు చేసే దీర్ఘకాల మూలధన లాభాలపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈక్విటీలపై పన్నును.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేట్ల స్థాయికి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. దీనితో పాటు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ పన్నుపైనా ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో చర్యలు తీసుకుంటారని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

click me!