ఏకాభిప్రాయం లేకే దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం: మారుతీ చైర్మెన్‌

By Sandra Ashok KumarFirst Published Jan 2, 2020, 10:37 AM IST
Highlights

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మోడీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సరిపోవని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తేల్చేశారు.  ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాల్సి ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం ప్రస్తుతం అత్యవసరం అని స్పష్టం చేశారు. రాజకీయ అనిశ్చితితో దేశంలో పెట్టుబడులు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులు లేకుండా కొలువులు రావని ఆర్సీ భార్గవ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: రాజకీయ ఏకాభిప్రాయం లేకే దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయని ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సంస్థ చైర్మెన్‌ ఆర్సీ భార్గవ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు తీవ్రతరం అవుతున్నా కేంద్ర సర్కార్, ప్రధాన ప్రతిపక్షాలు తమతమ స్వప్రయోజనాలపై దృష్టి సారించి సమస్య పరిష్కారం దిశగా కలిసి ముందుకు సాగలేకపోతున్నాయని అన్నారు. 

ఎవరికి వారే అన్న రీతిలో సాగుతుండడం వల్లే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర మందగమనంలోకి కూరుకుపోతోందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. రాజకీయ ఏకాభిప్రాయం కొరవడిన నేపథ్యంలో దేశీయ కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచించేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

also read విపణిలోకి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌.. 9శాతం అధిక మైలేజీ.. ధరెంతంటే?!

ఫలితంగా దేశంలో కొత్త పెట్టుబడులు లోపించి తగిన ఉద్యోగాల సృష్టి కూడా జరగడం లేదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు.  ప్రస్తుత ప్రతికూల వాతావారణంలో పరిశ్రమల వృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాలతో సర్కార్ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం మన ఆలోచన తీరంగా స్వల్పకాలికంగా సమస్య పరిష్కారం చుట్టూనే తిరుగుతున్నాయని తెలిపారు. 

ఉత్పాదక రంగంలో వృద్ధి, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అభిప్రాయపడ్డారు. దేశంలోని పారిశ్రామిక ప్రగతి కునారిల్లుతోందని, తయారీ రంగం మూలన పడిందని, వాహనాల తయారీ రంగం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక మందగమనం తీవ్రతరమవుతూ వృద్ధిరేటు పడిపోతూ వస్తోందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వాలు తీసుకున్న పలు నిర్ణయాత్మక బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం లభించక చట్ట సభల్లో నిలిచిపోయాయని తెలిపారు. ఫలితంగా పలు ప్రతికూల ఫలితాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిబింబిస్తున్నాయని వివరించారు. 

దేశ ప్రజల సమిష్టి ప్రయోజనాల రీత్యా దేశంలోని అన్ని పార్టీలు కలిసి పని చేయాలని ఆర్థిక వ్యవస్థ కష్ట కాలంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా అవసరమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. అన్ని పార్టీలూ ఒక అంగీకారంతో దేశాన్ని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకుపోవాలనే విషయమై ఆలోచన చేయాలని సూచించారు. 

దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడమనేది రాజకీయాంశం కాదని.. ఇది దేశంలోని ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడే బృహత్తర కార్యమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. దేశం స్వాతంత్య్రం పొంది ఏళ్లు గడుస్తున్నా దేశాభివృద్ధిని గణించేందుకు ఎలాంటి విధానాన్ని అవలంభించాలనే అంశంపై ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశంలో ఏర్పడిన మందగమన పరిస్థితులు సమస్యకు గల కారణాలను గురించి ఆలోచన చేసేందుకు ఇదో మంచి అవకాశమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. వృద్ధిరేటు పెరిగేంత వరకు దేశంలోకి కొత్త గా పెట్టుబడులు వచ్చి చేరవని అన్నారు. 

also read అత్యధికంగా అమ్ముడైన టు -వీలర్‌ ఏదో తెలుసా...?

వృద్ధిని పెంచకుండా కంపెనీలు కొత్త పెట్టుబడులతో ముందుకు రావని.. ఈ నేపథ్యంలో కొత్త కొలువులు కూడా అందుబాటులోకి రావని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ  విశ్లేషించారు. మన సామర్థ్యం మేరకు మన ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడం లేదని  అన్నారు. అయితే ప్రస్తుతం దేశంలోని నరేంద్ర మోడీ సర్కారు వృద్ధిని గాడిలో పెట్టేందుకు తగిన ప్రణాళికలను వేస్తున్నప్పటికీ వాటిపట్ల భార్గవ సంతృప్తి వ్యక్తం చేయలేదు. 

మోదీ సర్కార్ ప్రకటిస్తున్న స్వల్పకాలిక ఉపశమనాలతో ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మేలు జరగదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యూహాలతోముందుకు సాగాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన వివరించారు. ఈ సమయంలో సూక్ష్మ స్థాయి, దీర్ఘకాలిక ప్రణాళిక ఎంతైనా అవసరమని ఆయన సర్కారుకు సూచించారు. 

దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి ఆర్థిక వ్యవస్థకు సర్కారు మార్గనిర్దేశనం చేస్తే.. వాటిని దేశంలోని పరిశ్రమలు ముందుకు తీసుకు పోగలవని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న తమ సంస్థకు దీర్ఘకాలికంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలో తెలియని పరిస్థితి ఉందంటే.. మిగతా సంస్థల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ దిశగా సర్కారు ఆలోచనా తీరు ఉండాలని ఆయన సూచించారు.
 

click me!