Asianet News TeluguAsianet News Telugu

చంద్రుడిపై ఊపందుకున్న రియల్ ఎస్టేట్.. రెండెకరాలు కొన్న కృష్ణా జిల్లా వాసి

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్ఆర్ఐ బొడ్డు జగన్నాథరావు తన ఇద్దరు కుమార్తెల కోసం చంద్రుడిపై రెండెకరాల భూమిని కొన్నారు. 2005లోనే కుమార్తెలు ఇద్దరు పేరుతో చంద్రుడిపై ల్యాండ్ కొన్నాడు.

nri from krishna district bought two acres of land on moon ksp VJA
Author
First Published Sep 4, 2023, 9:36 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ తర్వాత చంద్రుని రహస్యాలపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలుగుతోంది. భవిష్యత్తులో చంద్రునిపై మనిషి ఆవాసం ఏర్పరచుకునేలా ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో చంద్రునిపై భూమిని కొనేవారు పెరుగుతున్నారు. కొన్ని సంస్థలు కూడా ఈ రకమైన వ్యాపారాన్ని మొదలపెట్టాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్ఆర్ఐ బొడ్డు జగన్నాథరావు తన ఇద్దరు కుమార్తెల కోసం రెండెకరాల భూమిని కొన్నారు. న్యూయార్క్‌లోని లూనార్ పబ్లిక్ సొసైటీ ఆఫీసుకు కుమార్తెలతో కలిసి వెళ్లిన ఆయన.. మానస, కార్తీకల పేరుతో చెరో ఎకరం భూమి కొన్నారు. దీనికి ఆ సంస్థ రిజిస్ట్రేషన్ క్లెయిమ్ డీడ్ ఇచ్చింది. 

ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన జగన్నాథరావు.. 2005లోనే ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ  గురించి తెలుసుకున్నారు. అలా చంద్రునిపై భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ క్లెయిమ్ డీడ్‌ను నిర్వహిస్తున్న సంస్థ నుంచి భూమిని కొనుగోలు చేశాడు. 2005లోనే కుమార్తెలు ఇద్దరు పేరుతో చంద్రుడిపై ల్యాండ్ కొన్నాడు. అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమిని కొనుగోలు చేసినట్లు జగన్నాథరావు వెల్లడించారు. ల్యాండ్ పార్సిల్ నంబర్లు, చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధన సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను రిజిస్ట్రేషన్ పత్రంలో ముద్రించి ఇచ్చినట్టు తెలిపారు. 

చంద్రునిపైన ఉపరితలానికి సంబంధించిన వీడియో సీడీ, కొనుగోలు చేసిన ల్యాండ్ మ్యాప్‌ను ఈ సంస్థ తనకు అందజేసినట్లు జగన్నాథరావు వెల్లడించారు. ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య కొనుగోలు చేసిన భూమి ఉందో.. లూనార్ ల్యాండ్స్ స్పష్టంగా పేర్కొంటూ జగన్నాథరావుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే చంద్రునిపై భూమిని కొనుగోలు చేసేందుకు వెచ్చించిన మొత్తాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios