Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: క‌రోనా ఆంక్ష‌లు ఎత్తేసిన యూపీ ! ఇక అన్ని ఓపెన్..

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు క‌ఠిన ఆంక్ష‌లు అమల్లోకి తీసుకువ‌చ్చాయి. ఇక కోవిడ్‌-19 ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో యూపీ ప్ర‌భుత్వం క‌రోనా ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. 
 

Uttar Pradesh lifts pandemic restrictions, all activites allowed in strict compliance with Covid protocol
Author
Hyderabad, First Published Mar 17, 2022, 5:50 PM IST

Coronavirus: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌రోనా ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. కోవిడ్-19 ప్రోటోకాల్‌కు కట్టుబడి అన్ని కార్యకలాపాలు అనుమతించబడతాయని స్పష్టం చేసింది. వివ‌రాల్లోకెళ్తే... 2020లో దేశంలోకి క‌రోనా ప్ర‌వేశించి తీవ్ర స్థాయిలో వ్యాపించి.. ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకుంది. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. తీవ్ర సంక్షోభానికి కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌కుండా.. క‌రోనా వ్య‌తిరేక పోరులో భాగంగా ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కూడా క‌ఠిన ఆంక్ష‌లు విధించారు. 

అయితే, దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం గ‌ణ‌నీయంగా త‌గ్గింది. కొత్త కేసులు, మ‌ర‌ణాలు త‌క్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. దీనికి తోడు కోవిడ్‌-19 టీకాలు తీసుకున్న వారు సైతం పెర‌గడంతో ఉత్త‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌రోనా ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. ఇప్ప‌టి నుంచి రాష్ట్రంలో స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్కులు, అంగన్‌వాడీ కేంద్రాలను తెరవడానికి అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్) అవనీష్ అవస్తీ అనుమతి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. గతంలో అనేక కార్యకలాపాలు అనుమతించబడినప్పటికీ, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్కులు, అంగన్‌వాడీ కేంద్రాలను తెరవడంపై ఆంక్షలు ఉన్నాయి. అలాగే,  వివాహాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌పై ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్న విషయాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే, ప్ర‌స్తుతం వాటిపై ఆంక్ష‌లు ఎత్తివేస్తున్న‌ట్టు తెలిపారు. అయితే, పూర్తిగా మాస్తులు ధ‌రించి.. COVID-19 ప్రోటోకాల్‌ను పాటిస్తూ.. పూర్తి సామ‌ర్థ్యంతో వేడుక‌లు జ‌రుపుకోవ‌చ్చాని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, దేశంలో కొత్త‌గా 2,539 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 60 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,16,132 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్ర‌స్తుతం 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కొత్త‌గా 51 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 20,70,114 చేరాయి. అలాగే,  క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 23,492 మంది ప్రాణాలు కోల్పోయారు.  

కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు 12-14 ఏండ్ల ఏజ్ గ్రూప్ వారికి కూడా టీకాలు ఇవ్వ‌డం ప్రారంభించింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కీల‌కంగా మారింది. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల 3 లక్షల మందికి పైగా పిల్లల‌కు కోవిడ్ -19 వ్యాక్సిన్ ను అందించినట్టు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం నాడు వెల్ల‌డించింది. దీంతో దేశంలో ప్ర‌జ‌ల‌కు అందించిన క‌రోనా డోసులు మొత్తం 180.80 కోట్లకు పైగా చేరుకున్నాయ‌ని తెలిపింది. 12-14 ఏళ్ల మధ్య వయస్సు వారికి టీకాలు వేయడం బుధవారం ప్రారంభమైంది. ఈ వయస్సు వారికి హైద‌రాబ‌ద్ కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ త‌యారు చేసిన ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ Corbevax టీకాలు అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios