Asianet News TeluguAsianet News Telugu

''ఏమయ్యా శామ్ పిట్రోడా ... వీళ్లంతా భారతీయులే అంటావ్..!'': కాంగ్రెస్ నేతపై నెటిజన్స్ ట్రోలింగ్

కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. భారతీయుల రంగు గురించి అవమానకర కామెంట్స్ చేసిన అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Sam Pitroda racist remark stirs controversy AKP
Author
First Published May 8, 2024, 5:01 PM IST

లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మూడు దశల ఎన్నికలు ముగియగా మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి వుంది. ఒక్కోదశ ఎన్నిక ముగుస్తున్నకొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ, కాంగ్రెస్ కీలకపాత్ర పోషిస్తున్న ప్రతిపక్ష ఇండి  కూటమి మధ్య పోటీ, మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీరియర్ లీడర్ శామ్ పిట్రోడా భారతీయుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 

శ్యామ్ పిట్రోడా ఏమన్నారు? 
 
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని... అందులో భాగంగానే దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వున్నాయి. ఇటీవల కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు బిజెపి పాలనలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోంది... కాబట్టి తమకు ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.   కానీ ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా దేశాన్ని నాలుగుగా విభజిస్తూ సంచలన కామెంట్స్ చేసారు. 

'' భారతదేశంలో తూర్పున వుండే ప్రజలు చేనీయుల్లా, పశ్చిమ ప్రాంతంలో వుండేవారు అరబ్బులలా, ఉత్తరాదిన వుండేవారు తెల్లవారిలా, దక్షిణ భారతీయులు నల్లగా ఆఫ్రికన్స్ లా వుంటారు'' అంటూ శ్యామ్ పిట్రోడా కామెంట్స్ చేసారు. 70 ఏళ్లుగా మన భారతదేశ గుర్తింపు ఇదే అనేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇలా యావత్ భారతీయులను అవమానించేలా కామెంట్స్ చేసిన ఓవర్సీస్ కాంగ్రెస్ నేతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బిజెపిని మతతత్వ పార్టీగా ఆరోపించే క్రమంలో పిట్రోడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. భారతదేశంలో నాలుగు దిక్కుల ప్రజలు నాలుగు రకాలుగా వుంటారని... కానీ కాంగ్రెస్ పాలనలో వారంతా కలిసిమెలిసి వున్నారని చెప్పే ప్రయత్నం  చేసారు. రాష్ట్రాలు వేరయినా, సంస్కృతులు భిన్నమైనా, ఆహార అలవాట్లలో తేడా వున్నా... చివరకు శరీర రంగులు వేరయినా భారతీయులంతా ఇంతకాలం అన్నదమ్ముల్లా కలిసి వున్నారని... ఇప్పుడు బిజెపి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని చెప్పే ప్రయత్నం చేసాడు పిట్రోడా. కానీ అతడి కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఇరకాటంలో పెట్టాయి. 

 

పిట్రోడా కామెంట్స్ పై మోదీ రియాక్ట్ :

ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో వున్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, ప్రజలను అవమానించేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని... వీటిపై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని ప్రధాని కోరారు. దేశాన్ని అవమానించేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని... తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తన దేశప్రజల రంగు గురించి అవమానకరంగా మాట్లాడితే మోదీ సహించబోరంటూ వరంగల్ సభలో ప్రధాని హెచ్చరించారు. 


జైరాం రమేశ్ రియాక్షన్ : 

శ్యామ్ పిట్రోడా కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమర్దించడం లేదు.భారతీయుల గురించి పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగం కావని మాజీ కేంద మంత్రి జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. 

బిజెపి నేతలు సీరియస్ : 

భారతీయుల శరీర రంగు గురించి అవమానకరంగా కామెంట్స్ చేసారంటూ శ్యామ్ పిట్రోడాపై బిజెపి నేతలు సీరియస్ అవుతున్నారు. ''శ్యామ్ భాయ్... నేను నార్త్ ఈస్ట్ కు చెందినవాడిని. కానీ నేను భారతీయుడిలాగే కనిపిస్తున్నాను. భారతీయులు చూడడానికి వేరుగా వుండొచ్చు... కానీ మేమంతా ఒక్కటే. మా దేశం గురించి కొద్దిగా అయినా తెలుసుకొండి'' అంటూ అస్సాం సీఎం హిమంతు బిశ్వ శర్వ కౌంటర్ ఇచ్చారు. 

తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై, ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కూడా పిట్రోడా కామెంట్స్ పై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మాటలే పిట్రోడా నోటివెంట వచ్చాయని... భారతీయులంటే ఆ పార్టీకి ముందునుండి చిన్నచూపేనని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. మొదట కులం,మతం, బాష పేరిట విభజించారు... ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇండియన్స్ ను చైనీయులతో పోల్చడం ఎంత దారుణం? ఇది దురహంకారం కాదా? అంటూ మండిపడుతున్నారు. 

సోషల్ మీడియాలో పిట్రోడా కామెంట్స్ హల్ చల్ : 

శ్యామ్ పిట్రోడా భారతీయులను వివిధ దేశాల ప్రజలతో పోల్చడం రాజకీయంగానే కాదు సోషల్ మీడియాతో దుమారం  రేపుతోంది. నెటిజన్లు పిట్రోడా కామెంట్స్ పై వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక మీమర్స్ అయితే చైనీయులను అరుణాచల్ వాసులుగా, అరబ్బులను రాజస్థాన్, ఇంగ్లీష్ వారిని ఉత్తర ప్రదేశ్,  ఆఫ్రికన్స్ ను తమిళనాడు వాసులుగా చూపిస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఇలా పిట్రోడా కామెంట్స్ పై దుమారం రేగుతోంది. భారతీయులను సైతం విదేశీయులుగా పేర్కొంటూ ఫోటోలు, మీమ్స్ సృష్టిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios