రవితేజ సినిమా కథ చెప్పి `బద్రి` చేసిన పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్ టెస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయట..
పూరీ జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. `బద్రి` సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా సెట్ కావడం వెనుక పెద్ద అబద్దం ఉందట. ఆ కథేంటో చెప్పాడు పూరీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్గా ఎదుగుతున్న సమయంలో పడిన బ్లాక్ బస్టర్ మూవీ `బద్రి`. బద్రి.. బద్రినాథ్ అంటూ ఇందులో పవన్ చేసే మ్యానరిజం, స్టయిల్ ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి ఒక వ్యసనంలా ఎక్కేసింది. `తొలి ప్రేమ`, `తమ్ముడు` వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ల తర్వాత వచ్చిన `బద్రి` పవన్కి హ్యాట్రిక్ హిట్ని ఇచ్చింది.
`బద్రి` సినిమాతో పవన్ రేంజే మారిపోయింది. ఆయన క్లాస్, మాస్లోకి వెళ్లిపోయాడు. ఇందులో పవన్ క్యారెక్టరైజేషన్ అంత క్రేజీగా ఉంటుంది. ఈ మూవీతో దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. తొలి సినిమా కావడంతో తన పిచ్చి అంతా చూపించారు. పవన్ని ఆయన ఊహించినదాని కంటే ఎక్కువగా చూపించాడు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అయితే ఈ సినిమా సెట్ కావడం వెనుకాల పెద్ద అబద్దం ఉందట. పూరీ జగన్నాథ్ ఓ పెద్ద అబద్దం చెప్పి పవన్కి కథ చెప్పాడట. అదేంటో డాషింగ్ డైరెక్టర్ బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు పూరీ. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడే హిట్లతో స్టార్ అవుతున్నాడట. ఆ సమయంలో ఆయనకు ఓ కథ చెప్పాలని డిసైడ్ అయ్యాడట పూరీ జగన్నాథ్. అప్పటి వరకు ఏదో యాడ్స్, టీవీ సీరియల్స్ షూటింగ్ లు చేస్తూ ఉండేవాడట. రెండు మూడు కథలు రెడీ చేసుకుని పెట్టుకున్నాడు.
పవన్ తో `బద్రి` సినిమా చేయాలనుకున్నాడట. ఆ కథ చెప్పాలని చాలా రోజులుగా తిరుగుతున్నాడట. ఆయన మేనేజర్కి కలిసి ఇలా కథ ఉందని చెబుతూ వస్తున్నాడట. మేనేజర్ కూడా పవన్కి ఈ విషయం చెప్పి ఉంచాడు, కానీ అది సీరియస్గా తీసుకోలేదు. ఐదారు నెలలుగా తిరుగుతున్నా పని అవడం లేదు. దీంతో కెమెరామెన్ ఛోటాకే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనకు క్లోజ్. ఛోటా పవన్కి క్లోజ్గా ఉంటాడు. దీంతో ఇలా కథ ఉంది, అన్నయ్య ద్వారా పవన్ కళ్యాణ్కి కథ చెప్పించవచ్చు కదా అన్నాడట పూరీ.
ఛోటాకే నాయుడు చెబితే పవన్ కళ్యాణ్ ఓకే అంటాడు, కానీ కథ బాగాలేకపోతే మాటొస్తుందని చెప్పి, ముందే తనకు కథ చెప్పమన్నాడట ఛోటా కే నాయుడు. దీనికి పూరీ ఏం చేశాడు.. `బద్రి` కథ చెబితే ఒప్పుకోరు, హీరో ఇద్దరమ్మాయిలతో ఒకేసారి ప్రేమలో పడతాడని చెబితే ముందే రిజెక్ట్ చేస్తారని భావించి ఆయనకు `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` కథ చెప్పాడట. కథ బాగుందని చెప్పి, ఛోటా కే నాయుడు పవన్కి సమాచారం ఇచ్చాడట. ఓ రోజు పూరీని పిలిపించాడట పవన్.
ఉదయం నాలుగు గంటలకే రమ్మని చెప్పాడట. ఆ టైమ్లో కథ చెప్పడమేంటి? అని ఆశ్చర్యపోయాడట, మూడు గంటలకు రెడీ అయి పవన్ దగ్గరకు వెళ్లాడట. అలా వెళ్లడం పూరీకి మొదటి సారి. పవన్ నాలుగు గంటలకు నిద్రలేస్తారట. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఇలా కథ అని చెబితే అర్థగంట సమయం మాత్రమే ఇచ్చాడట. అంత తక్కువ సమయంలోనే కథ చెప్పలేనని చెప్పి, తాను కథ చెబుతాను, ఇంట్రెస్ట్ లేకపోతే డోర్ ఓపెన్ చేయండి వెళ్లిపోతాను అన్నాడట పూరీ.
అలా నాలుగు గంటలకు కథ చెప్పడం స్టార్ట్ చేయగా, అర్థగంటకు మేనేజర్ వచ్చి డోర్ తీయగా, పవన్ వద్దన్నాడట. అలా మూడు నాలుగు సార్లు జరిగిందట. మొత్తం నాలుగు గంటల పాటు కథ నెరేట్ చేశాడట. పవన్ కథ విని.. నాకు వేరే కథ చెప్పారే అన్నాడట. అప్పుడు అసలు విషయం రివీల్ చేశాడు పూరీ. సర్ ఈ కథ ఆయనకు చెబితే అక్కడే వద్దంటాడు, మీ దాక రాలేను, అందుకే ఆ కథ అని అబద్దం చెప్పాను అన్నాడట. అది విన్న పవన్.. అంతా బాగానే ఉంది, క్లైమాక్స్ నచ్చలేదన్నాడట. అది మారిస్తే నువ్వే డైరెక్టర్ అనిచెప్పాడట.
అలా వెళ్లిన పూరీ జగన్నాథ్.. రెండు మూడు వెర్షన్ క్లైమాక్స్ రాసుకున్నాడట. కానీ ఆయనకు నచ్చడం లేదట. మళ్లీ పవన్ నుంచి కాల్ వస్తే.. మళ్లీ వెళ్లిన పూరీ అదే క్లైమాక్స్ ని మరింత డిటెయిల్గా చెప్పాడట. అదేంటి ఇది సేమ్ ఉందిగా అన్నాడట. అప్పుడు పూరీ.. వేరే కూడా రాసుకున్నాను సర్, కానీ అవేవీ నాకు నచ్చడం లేదు. ఇదే క్లైమాక్స్ బాగుందనిపిస్తుందన్నాడట. కాసేపు టెన్షన్ పెట్టించిన పవన్.. అసలు విషయం రివీల్ చేశాడు. ఇదే బాగుంది, కాకపోతే నాకోసం క్లైమాక్స్ మారుస్తావా? లేదా అని టెస్ట్ చేశానని చెప్పాడట.
అలా `బద్రి` చేసి హిట్ కొట్టాడు పూరీ. ఇండస్ట్రీలోకి బలంగా ఎంటరయ్యాడు. పవన్కి మరో హిట్ పడింది. అలా వీరి జర్నీ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా, అమిషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంతో పూరీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. టీ త్రివిక్రమ రావు నిర్మాత. 2000లో ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఆ తర్వాత 12ఏళ్లకు `కెమెరామెన్ గంగతో రాంబాబు` చిత్రాన్ని రూపొందించారు. పొలిటికల్ సందేశాన్ని అందించే ఈ చిత్రం పరాజయం చెందింది. మళ్లీ ఈ కాంబో రిపీట్ కాలేదు. ఇదిలా ఉంటే పవన్కి ముందు చెప్పిన `ఇట్లు శ్రావణి సుబ్రమ్మణ్యం` కథని రవితేజకి చెప్పి హిట్ కొట్టాడు. మాస్ మహా రాజాకి ఈ మూవీ లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో పూరీ ఈ విషయాన్ని చెప్పడం విశేషం.