ఎన్నికల సమరంలో బాబాయ్ కోసం అబ్బాయ్... పిఠాపురం వస్తున్న వరుణ్ తేజ్!
హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన చేసింది. శనివారం పిఠాపురంలో వరుణ్ తేజ్ సందడి చేయనున్నాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన+టీడీపీ+బీజేపీ కూటమిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వాటిలో ఒకటి పిఠాపురం. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన కేటాయించారు. ఇక వైసీపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా వంగ గీత పోటీ చేస్తున్నారు.
వంగ గీత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. స్థానికంగా వంగ గీత బలమైన అభ్యర్థి కావడంతో పవన్ కళ్యాణ్ తేలికగా తీసుకోవడం లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, నటుడు పృథ్విరాజ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం స్వయంగా పిఠాపురం వస్తున్నాడు. ఏప్రిల్ 27న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నానునారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వరుణ్ తేజ్ ఓటర్లను విజ్ఞప్తి చేయనున్నాడు. కాగా గతంలోనే వరుణ్ తేజ్ జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి సిద్ధం అన్నారు. బాబాయ్ పిలుపు కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చెప్పినట్లే వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నాడు.