`కల్కి2898ఏడీ` వాయిదాని కన్ఫమ్ చేసిన నిర్మాత.. పోస్ట్ పోన్కి కారణం అదే అని వెల్లడి..
ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమా వాయిదా పడుతుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నిర్మాత స్వప్న దత్ స్పందించారు.
ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తీసుకొచ్చిన హైప్ ఆ రేంజ్లో ఉంది. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండటం, సైన్స్ ఫిక్షన్గా రూపొందుతున్న ఈ మూవీకి మైథలాజికల్ అంశాలతో ముడిపెట్టడం వంటివి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. దీనికితోడు ప్రభాస్ తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, రానాలు నటిస్తుండటం, చాలా మంది స్టార్స్ గెస్ట్ రోల్స్ చేస్తుండటంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఏర్పడింది.
కానీ ఈ మూవీని వాయిదాలు వెంటాడుతున్నాయి. గతేడాది రావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారు. ఇప్పుడు నాల్గోసారి వాయిదా పడుతుంది. మే 9 రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదని, ఎన్నికల నేపథ్యంలో సినిమాని వాయిదా వేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై టీమ్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రిలీజ్ అవుతుందా? లేదా అనేది కూడా చెప్పలేదు. ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఎవరికి వచ్చినట్టు వాళ్లు గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.
తాజాగా దీనిపై నిర్మాత స్వప్పా దత్ స్పందించింది. ఓ ఇంగ్లీష్ మీడియాతో ముచ్చటిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. సినిమా వాయిదా పడుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. సినిమా కొన్ని వారాలు వాయిదా పడుతుందని తెలుస్తుంది, కారణాలు ఏంటి? అని ప్రశ్నించగా, అది నిజమే అని, ప్రస్తుతం సినిమా వర్క్ జరుగుతుందని, ఇంకా కంప్లీట్ కాలేదని తెలిపింది. ఈ సందర్భంగా ఎన్నికల విషయాన్ని ప్రస్తావించింది. ఎన్నికలు ఉన్నాయి, వాటి ప్రభావం సినిమాపై ఉంటుందని, తమ సినిమా పార్టనర్స్, బయ్యర్ల అభిప్రాయాలను, వారి బాగోగులను దృష్టిలో పెట్టుకుని సినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అయితే ఎప్పుడు కొత్త డేట్ అనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
నాగ్ అశ్విన్ `కల్కి 2898ఏడీ` చిత్రాన్ని భారీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ఆరువేల సంవత్సరాల వెనక్కి, ముందుకు లింక్ పెడుతూ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇందులో ప్రభాస్ విష్ణుమూర్తిగా కనిపిస్తారని టాక్. ఆయన డిఫరెంట్ గెటప్స్ లోనూ దర్శనమిస్తారట. ఇందులో కమల్ ది మాత్రం గెస్ట్ రోల్ అని, రెండో పార్ట్ లో ఆయనది ఫుల్ రోల్ ఉంటుందని సమాచారం. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ పతాకాలపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. స్వప్న దత్ అన్నీ డీల్ చేస్తున్నారు.