స్పిరిట్ షూటింగ్ కి సర్వం సిద్ధం... ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే?
ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో హోరెత్తిస్తున్నారు. స్పిరిట్ షూటింగ్ కి సర్వం సిద్ధం అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సలార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత వరుసగా మూడు ప్లాప్స్ ఎదుర్కొన్న ఆయనకు సలార్ రూపంలో ఉపశమనం దొరికింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సలార్ కి కొనసాగింపుగా సలార్ 2 తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి 2829 AD , రాజా సాబ్ సెట్స్ పై ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న రాజా సాబ్ హారర్ కామెడీ చిత్రం అంటూ ప్రచారం జరుగుతుంది.
కాగా ప్రభాస్ చాలా కాలం క్రితమే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు. హీరోలను వైలెంట్ గా చూపించడంతో దిట్ట అయిన సందీప్ రెడ్డి, ప్రభాస్ వంటి మాస్ హీరోతో చేస్తున్న మూవీ కావడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. స్పిరిట్ పై ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సందీప్ రెడ్డి వంగ హ్యాట్రిక్ విజయాలతో బాక్సాఫీస్ షేక్ చేశాడు.
కాగా స్పిరిట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది అనేది తాజా సమాచారం. సందీప్ రెడ్డి వంగ ఈ మేరకు సంసిద్ధం అవుతున్నారట. స్క్రిప్ట్ డెవెలెప్మెంట్ చివరి దశలో ఉండగా... షూటింగ్ కి టైమ్ ఫిక్స్ చేశాడట. నవంబర్ నుండి స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానుందట. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.
అలాగే స్పిరిట్ బ్యాగ్రౌండ్ స్కోర్ పై కూడా సందీప్ రెడ్డి వంగ కసరత్తు చేస్తున్నాడట. హర్షవర్ధన్ రామేశ్వరన్ బీజీఎమ్ అందిస్తుండగా అతనితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అయ్యాయట. కొన్ని కీలక పాత్రల కోసం టాలీవుడ్ నటులను సందీప్ రెడ్డి సంప్రదించారట. సందీప్ రెడ్డి జోరు చూస్తుంటే 2025 చివరి కల్లా స్పిరిట్ చిత్రాన్ని థియేటర్స్ లోకి తేవడం ఖాయం అనిపిస్తుంది.