ఆరంభం ట్రైలర్ అదిరింది, నవీన్ చంద్రకు సత్కారం, తెలుగు తేజం కలశకి డాక్టరేట్, ఓటీటీలో `మంజుమ్మల్ బాయ్స్`..
అదిరిపోయిన ఆరంభం ట్రైలర్.. నవీన్ చంద్రకు దాదా సాహెబ్ ఫాల్కే పేరున అవార్డ్.. ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ సందడి.. ఇలా టాలీవుడ్ అప్ డేట్స్ ను చూద్దాం.
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" సినిమా మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ గా చెప్పుకునే సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. ఈ సినిమాను సర్వైవల్ థ్రిల్లర్ గా దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ రూపొందించారు. పరవ ఫిలింస్ బ్యానర్పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందీ సినిమా. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా....ఇక్కడా మంచి వసూళ్లు దక్కించుకుంది.'మంజుమ్మల్ బాయ్స్' సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమాను మే 5వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'మంజుమ్మల్ బాయ్స్' అందుబాటులో ఉండనుంది.
ఇంపాక్ట్ స్టార్ నవీన్ చంద్ర మరో అద్భుతమైన ఘనత సాధించారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ...
వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము.. అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం. ఆగస్టు 13, 2013లో జన్మించిన కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు.
‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.
బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్, ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు, ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది.