Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ కట్టడికి ఐదు ద‌శ‌ల వ్యూహాన్ని అనుస‌రించండి.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన

పొరుగు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ఐదు దశ వ్యూహాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. 

Follow the Five-Step Strategy for Kovid Building .. Union Ministry of Health Recommendation to States
Author
New Delhi, First Published Mar 18, 2022, 12:04 PM IST

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కూడా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, COVID-19 ప్రవర్తన’ అనే ఐదు దశల వ్యూహానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను శుక్ర‌వారం కోరింది. ఆగ్నేయాసియా, యూరప్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా జాగ్రత్తలు పాటించాలని  కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్  రాష్ట్ర కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపారు.

‘‘ ఆగ్నేయాసియా, యూరప్‌లోని కొన్ని దేశాల్లో కోవిడ్-19 కేసుల్లో పునరుజ్జీవనాన్ని గమనించిన నేపథ్యంలో 2022 మార్చి 16వ తేదీన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. స్థిరమైన జీనోమ్ సీక్వెన్సింగ్, నిఘాను తీవ్రతరం చేయాలని సూచించారు. ’’ అని భూషణ్ తన లేఖలో పేర్కొన్నారు. 

COVID-19కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కేంద్రం నుంచి నిరంతర మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు, UTలకు ఆయన భూష‌ణ్ హామీ ఇచ్చారు. చైనాతో స‌హా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొత్త COVID-19 కేసుల నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి భూష‌ణ్ తాజా ఆదేశాలు జారీ చేశారు. 

గురువారం చైనాలో 2,388 COVID-19 కొత్త కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపింది. ఇది బుధ‌వారం నాటి 1,226 కేసుల కంటే ఎక్కువ. ఇదిలా ఉండ‌గా భార‌త్ లో గ‌డిచిన 24 గంటల్లో 2,528 తాజా COVID-19 కేసులు న‌మోద‌య్యాయి. 3,997 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 149 మరణాలు సంభ‌వించాయి. దీంతో దేశంలో యాక్టివ్‌గా ఉన్న COVID-19 కేసుల సంఖ్య 29,1881 గా ఉంది. రోజువారీ సానుకూలత రేటు 0.40 శాతంగా న‌మోద‌య్యింది. COVID-19 నుంచి ఇప్పటివరకు 4,24,58,543 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కోవిడ్ -19 వ‌ల్ల మరణాల సంఖ్య 5,16,281 గా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన తాజా వివ‌రాల ప్ర‌కారం ఇప్పటి వరకు దేశంలో 1,80,97,94,58 మందికి వ్యాక్సిన్ లు అందాయి. 

మన పొరుగు దేశం చైనాలో మళ్లీ  COVID-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  కేసులను నియంత్రించడానికి చైనా అంతటా దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంచింది. దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు ప్రారంభ‌మైన‌ప్పటి నుంచి ఇదివర‌కు చూడ‌ని విధంగా ప్ర‌స్తుతం అక్క‌డ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆరోగ్య అధికారులు నగర వీధుల్లోకి వ‌చ్చి సామూహిక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న దృశ్యాలు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. హాంకాంగ్‌లో కూడా పరిస్థితి మరింత దిగజారింది. అలాగే యూఎస్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌న దేశం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌నే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంత‌ల‌కు లేఖ రాసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios