Asianet News TeluguAsianet News Telugu

Coronavirus : పెరుగుతున్నకోవిడ్ కేసులు.. 7 జిల్లాల్లో మ‌ళ్లీ మాస్క్ తప్ప‌నిస‌రి.. ఎక్క‌డంటే ?

మొన్నటి వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్కులు లేకుండా ప్రశాంతంగా తిరిగాం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాస్క్ తప్పనిసరి కాదని ప్రకటించాయి. కానీ ఆ కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఏడు జిల్లాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

Coronavirus : Rising Covid Cases .. Mask Compulsory Again In 7 Districts.. Where?
Author
New Delhi, First Published Apr 18, 2022, 4:22 PM IST

మ‌ళ్లీ కోవిడ్ టెన్ష‌న్ పెడుతోంది. కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌తో పాటు మ‌న దేశంలోనూ ఈ ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో కేసుల పెరుగుదలలో వేగం క‌నిపిస్తోంది. దీంతో అంద‌రిలో ఆందోళ‌న మొద‌లైంది. ఇటీవ‌లే క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్ర‌భుత్వం ఆంక్ష‌లు ఎత్తేశాయి. కానీ మ‌ళ్లీ ఇప్పుడు ఆంక్ష‌లు విధించ‌డం ప్రారంభించాయి. 

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాజధాని లక్నోతో పాటు ఎన్‌సీఆర్ జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ విష‌యాన్ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఢిల్లీలో కోవిడ్ కేసుల పెరుగుదల జాతీయ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోకి వచ్చే జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్‌తో పాటు రాజధాని లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను ఉపయోగించడం తప్పనిసరి చేసినట్లు అధికారిక ప్రతినిధి తెలిపారు.

గ‌డిచిన 24 గంటల్లో గౌతమ్ బుద్ధ నగర్‌లో 65, ఘజియాబాద్‌లో 20, లక్నోలో 10 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా కోవిడ్ -19 కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలోనే ఫేస్ మాస్కులు త‌ప్పనిస‌రి కాద‌ని చెప్పింది. అయితే ఈలోపే కేసులు పెరుగుతుండటంతో కొన్ని జిల్లాలో మాస్క్ త‌ప్ప‌నిసరి చేసింది. 

అయితే కోవిడ్ -19 కేసుల్లో పెరుగుద‌ల క‌నిపిస్తుండ‌టంతో ఢిల్లీ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తనిఖీ చేయడంలో సహాయపడటానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని  ఢిల్లీ వైద్యులు అధికారులను కోరారు. కోవిడ్ వంటి లక్షణాలు క‌లిగి ఉన్న వ్య‌క్తులు తమను తాము పరీక్షించుకోవాలని, వ్యాప్తిని నిరోధించడానికి క్వారంటైన్ లో ఉండాల‌ని కోరుతున్నారు. మ‌ళ్లీ కేసుల పెరుగుదల నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు పెంచాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని నొక్కి చెప్పారు. అయితే, ఇప్పుడే కఠినమైన ఆంక్షలు అవసరం లేదని తెలిపారు. 

NCR ప‌రిధిలో ఉన్న న‌గ‌రాల్లో క‌రోనా కేసుల పెరుగ‌దలో వేగం క‌నిపిస్తోంది. ఢిల్లీకి చుట్టుప‌క్క‌ల ఉండే రెండు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కారణంగా, దేశంలో కోవిడ్ క్రియాశీల కేసులు 12,000 కి చేరుకుంది. గత ఏడు రోజుల్లో కొత్త కోవిడ్-19 కేసుల సంఖ్య 35 శాతం పెరిగిన‌ట్టు అధికారిక గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. హర్యానాలో ఈ వారంలో కేసులు 1,119కి పెరిగాయి. ఇది గత వారం 514గా ఉన్నాయి. అంటే దాదాపు  118 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. అలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో గ‌తం వారం 224 కేసులు ఉండ‌గా.. ఈ  వారం 540 కేసులతో న‌మోదు అయ్యాయి. అంటే 141% పెరుగుదలను నమోదు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్ర‌ధానంగా NCR ఆనుకొని ఉన్న గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లోనే కొత్త కేసులు ఎక్కువ‌గా న‌మోదు అయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios