సంక్రాంతి నాడు క్యాసినో నిర్వహణ.. రేపు గుడివాడకు టీడీపీ నిజ నిర్థారణ కమిటీ
సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో (gudivada) క్యాసినో నిర్వహించారని.. దీనిపై మరింత వాస్తవాలను బయటపెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యులతో కూడిన నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు అచ్చెన్నాయుడు.
జూదాలతో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందన్నారు ఏపీ టీడీపీ (tdp) అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) . మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో యువతను పెడదోవ పట్టించేలా నీచమైన సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ఆయన దుయ్యబట్టారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో (gudivada) క్యాసినో నిర్వహించారని.. దీనిపై మరింత వాస్తవాలను బయటపెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యులతో కూడిన నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలోని సభ్యులు రేపు (శుక్రవారం) గుడివాడలో పర్యటించి పూర్తి స్థాయిలో నివేదికను సేకరిస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు. తుది నివేదికను కమిటీ సభ్యుల బృందం పార్టీ అధిష్టానానికి అందిస్తుంది. ఈ కమిటీని మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ సమన్వయం చేసుకుంటారని అచ్చెన్నాయుడు చెప్పారు.
నిజనిర్థారణ కమిటీలోని సభ్యులు
- నక్కా ఆనందబాబు
- వర్ల రామయ్య
- కొల్లు రవీంద్ర
- బోండా ఉమామహేశ్వరరావు
- ఆలపాటి రాజా
- శ్రీమతి.తంగిరాల సౌమ్య
కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంరంగం వైభవంగా జరిగాయి. అయితే, పేకాట, కోడిపందాలు, క్యాసినో గ్యాంబ్లింగ్ వంటి పందాల్లో మూడు రోజుల్లో కోట్లాది రూపాయల మేరకు చేతులు మారాయి. ముఖ్యంగా, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖామంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో గోవా క్యాసినో కల్చర్.. నృత్యాలు సంబంధించిన విషయాలు వివాదస్పదమవుతున్నాయి. గుడివాడ క్యాసినో గాంబ్లింగ్, అక్కడి నృత్యాలపై టీడీపీ బృందం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పేరుతో గ్యాంబ్లింగ్ అసభ్యకర నృత్యాలు జరిగాయని టీడీపీ నేతల బృందం ఆరోపించింది.
గుడివాడ కే కన్వెన్షన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్, క్యాసినో నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరికట్టాల్సిన పోలీసులు వాటిని నివారించలేకపోయారని పేర్కొన్నారు. కనుమ పండుగ రోజు గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఎ-కన్వెన్షన్ లో విచ్చలవిడిగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్, చట్టవిరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 500 కోట్ల రూపాయలు మేరా డబ్బులు క్యాసినో ద్వారా చేతులు మారాయని వారు ఆరోపించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగువారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. సంఘ విద్రోహక శక్తులు కూడా పెద్ద ఎత్తున చొరపడ్డారని లేఖ ద్వారా తెలిపారు.
గుడివాడలో క్యాసినో గ్యాంబ్లింగ్.. నృత్యాల పై ఎస్పీకి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేతల్లో వర్ల రామయ్య, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, ఎమ్మెల్యే గద్దే రామోహన్, ఎమ్మెల్సీ బొచ్చల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు ఉన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికార పార్టీ నేతల హస్తంతోనే ఈ చర్యలు కొనసాగాయని ఆరోపించారు.