జగన్ పై రాళ్ల దాడి చేయమంది చంద్రబాబే.. వైకాపా సంచలన వీడియో వైరల్
YSRCP vs TDP : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్లదాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేయించింది చంద్రబాబే నంటూ వైఎస్ఆర్సీపీ సంచలన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి.
Chandrababu Naidu - YS Jagan Mohan Reddy : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైకాపా బస్సు యాత్రను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో పాలుపంచుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, విజయవాడలో గుర్తుతెలియని దుండగులు జగన్ పైకి రాళ్లు విసరడంతో ఆయన గాయపడ్డారు. ఈ రాళ్లదాడిలో జగన్ కంటిపై భాగంలో గాయం అయింది. అయితే, ఈ దాడి వెనుకు టీడీపీ ఉందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ తాజాగా ఒక సంచలన వీడియోను విడుదల చేసింది. జగన్ పై దాడి చేయించింది చంద్రబాబే నంటూ ఆరోపించింది.
ఓ ప్రచార ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాళ్లతో కొట్టాలని ప్రజలను ప్రేరేపించారు. ఈ వీడియో దృశ్యాలను జగన్ పై ఆడి జరిగిన దృశ్యాలను ఒకే వీడియోలో పంచుకుంది వైకాపా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో దృశ్యాలను గమనిస్తే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాటికొండలో చంద్రబాబు మాట్లాడారు. అందులో టీడీపీ కార్యకర్తలు, అక్కడకు వచ్చిన జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని వైకాపా పేర్కొంది. రాళ్లతో లేదా కనిపించిన దాన్ని తీసుకుని ఫ్యాన్ పై దాడి చేయాలని చంద్రబాబు కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై దాడి చేయాలని టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు వైకాపా నాయకులు. ఈ దాడికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు.
జగన్ పై రాళ్లదాడి పక్కా ప్లాన్ ప్రకారమేనా? ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు?
వైఎస్ఆర్సీపీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో పోస్టులో.. "జగనన్నపై రాళ్ల దాడి చేయమని పచ్చ గూండాలని రెచ్చగొట్టిన చంద్రబాబు! తాడికొండ బహిరంగ సభలో టీడీపీ కేడర్ను రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు. రాయి తీసుకుని సీఎం వైఎస్ జగన్ గారిపై దాడి చేయాలని ఆదేశం.. చంద్రబాబు స్పీచ్ ముగిసిన గంటల వ్యవధిలోనే జగనన్నపై దాడి ! " అంటూ పేర్కొంది.
ఇదిలావుండగా, సీఎం జగన్ పై దాడి జరగడంపై రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇక సీఎంపైనే దాడి జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ రాళ్లదాడి ఘటనపై ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు కొరకు ఆరు ప్రత్యేక అధికారుల బృందం కూడా రంగంలోకి దిగింది. జగన్ యాత్ర కొనసాగిన ప్రాంతం, దాడి జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ భవనం, ఎదురుగా మరో భవనం ఉన్న ప్రాంతంలో జగన్ పై రాళ్లతో దాడి చేశారు. దీంతో స్కూల్ వాచ్ మెన్ తో పాటు మరో భవనం లోని వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
సీఎం జగన్ పై రాళ్లదాడి.. కంటిపై గాయం.. వీడియో