ఏసియానెట్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే : చంద్రబాబుకు టఫ్ ఫైట్ ... జగన్ కు కలిసొచ్చే అంశాలివే...
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరిపక్షాన నిలుస్తారు? మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు? ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేవి? ... ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలతో ఏసియా నెట్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జగన్ సర్కార్ కు కలిసివచ్చేలా కనిపిస్తున్న అంశాలేవంటే....
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో గెలిచేది మేమంటే మేమంటూ అధికారం వైసిపి, ప్రతిపక్ష కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా గత ఐదేళ్లు అద్భుతంగా పాలించామని వైసిపి అంటోంది. తమ పాలనలో ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ది జరిగిందిని ... అవే తమను గెలిపిస్తాయన్నది వైసిపి ధీమా. ఇక తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక ఓటు, ప్రతిపక్ష జనసేన, బిజెపిలతో పొత్తు తమకు కలిసివస్తుందని భావిస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరెంత ధీమాతో వున్న గెలుపోటములను నిర్ణయించేంది ప్రజలే. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మూడ్ తెలుసుకుంటే ఈసారి గెలిచేదెవరు? అధికారం ఎవరికి దక్కుతుంది? మళ్లీ ముఖ్యమంత్రి ఎవరు? అవుతారనే ప్రశ్నలకు సమాధానం దొరుకుంది. కాబట్టి ప్రజా నాడి పట్టేందుకు ఏసియా నెట్ తెలుగు ఆన్ లైన్ సర్వే నిర్వహించింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైసిపి పాలనపై పెద్దగా వ్యతిరేకంగా ఏమీ లేరనేది ఏసియా నెట్ సర్వేలో తేలింది. ముఖ్యంగా జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా మారేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్ పై పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు... కానీ ఎక్కువశాతం మంది మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బావుంటుందని కోరుకుంటున్నారు. ఇలా సంక్షేమ, అభివృద్దితో పాటు ఎన్నికలను ప్రభావితం చేసే ఇతర అంశాల్లో వైసిపి ప్రభుత్వం, వైఎస్ జగన్ పరిస్థితి ఎలా వుందో చూద్దాం.
గత ఐదేళ్ల వైసిపి పాలన ఎలావుందని ప్రజాభిప్రాయం కోరగా బాగుందని సర్వేలో పాల్గొన్న 39 శాతం మంది తెలిపారు. దాదాపు ఇదేస్థాయిలో అంటే 40 శాతం మంది మెరుగుపడాల్సిందని, 21 శాతం మంది ఏమీ చెప్పలేమన్న అభిప్రాయం వ్యక్తం చేసారు. దీన్ని బట్టి వైసిపి ప్రభుత్వంపై మరీ అంత వ్యతిరేకత లేదని అర్థమవుతోంది. ఇక వైసిపి పాలనగురించి ఏమీ చెప్పలేకపోయారంటే వాళ్లు డైలమాలో వున్నట్లే... కాబట్టి ఇలాంటి అభిప్రాయం కలిగినవారికి దగ్గర కాగలిగితే జగన్ పార్టీకి మంచి రిజల్ట్ పొందవచ్చు. మొత్తంగా వైసిపి పాలనపై ప్రజల్లో మిశ్రమ అభిప్రాయం వున్నట్లు సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతుంది.
ఇక జగన్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ప్రజా సంక్షేమ పథకాల అమలు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలు సమస్యలను ఎదుర్కోకూడదనే వాలంటీర్ వ్యవస్థను, సచివాలయాలను ఏర్పాటుచేసారు. దీన్నిబట్టి ప్రజా సంక్షేమం విషయంలో సీఎం జగన్ ఎంత కమిట్ మెంట్ తో వున్నారో అర్థమవుతుంది. ఇక జగన్ సర్కార్ అమలుచేస్తున్న చాలా సంక్షేమ పథకాలలో నేరుగా నగదు బదిలీ జరుగుతోంది... అంటే ప్రభుత్వం నుండి నేరుగా అర్హులకు డబ్బులు అందుతున్నాయి. ఇలా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఎంతలా అంటే ఈ సంక్షేమ పథకాలు రాబోయే ఎన్నికల్లో వైసిపికి మేలు చేస్తాయని అత్యధికంగా 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రభావం వుండదని మరో 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో వైసిపి సాధించిన అతిపెద్ద విజయం కూడా సంక్షేమ పథకాల అమలేనని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు.
వైఎస్ జగన్ కు ఈసారి చెల్లితో పొలిటికల్ పోరు తప్పడంలేదు. తమ తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ లో చేరింది షర్మిల... ఇలా తండ్రి రాజకీయ వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదని... షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడే పరిస్థితులు లేవని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభావం పెద్దగా వుండదని 46 శాతం మంది అభిప్రాయం. మరో 36 శాతం మంది ఏమైనా ప్రభావం వుండవచ్చని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే సొంత చెల్లి షర్మిల వ్యతిరేకిస్తున్నా ఆ ప్రభావం ఎన్నికలపై పెద్దగా లేకపోవడం వైఎస్ జగన్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ ను చూడాలని సర్వేలో పాల్గొన్న 42 శాతం కోరుకున్నారు. ఈయన కంటే చంద్రబాబును నెక్ట్స్ సీఎంగా చూడాలనుకుంటున్నవారు 47 శాతంగా వున్నారు. ఇలా ముఖ్యమంత్రి పదవి విషయంలో చంద్రబాబు, జగన్ ల మధ్య కొద్దిపాటి తేడా వుంది. అంటే ముఖ్యమంత్రిగా కూడా మరీ ఎక్కువగా ప్రజావ్యతిరేకత జగన్ పై లేదని అర్థమవుతుంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ ప్రభావంపై కూడా మిశ్రమ స్పందన వచ్చింది. 44 శాతంమంది అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందంటే మరో 41 శాతం ఏమీ చూపదని అంటున్నారు. అంటే చంద్రబాబు అరెస్ట్ సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కాదని ... దీని వల్ల వన్ సైడ్ ఓటింగ్ ఏమీ వుండదని తెలుస్తోంది. ఇది వైఎస్ జగన్ కు అనుకూలమైన అంశమే.
మూడు రాజధానుల నిర్ణయం వైసిపి బాగా దెబ్బతీస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏసియా నెట్ సర్వేలో కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమైనా విశాఖకు రాజధాని తరలింపు వైసిపి కాస్త ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. విశాఖకు రాజధాని తరలింపు నిర్ణయం వైసిపి లాభం చేస్తుందని 38 శాతం అభిప్రాయం. కానీ అత్యధికులు మాత్రం (49 శాతం) రాజధాని తరలింపుతో వైసిపికి ఎలాంటి లాభం వుండదన్నారు.
- Andhra Pradesh Assembly Elections 2024
- Asianet News Networks Survey Result
- Asianet News Pre poll survey
- Asianet News Survey 2024
- Asianet News Survey AP Elections
- Asianet News Survey on Andhra pradesh Assembly Elections 2024
- Asianet News survey result
- Mood of the Andhra Padesh Survey Result
- Nara Chandrababu Naidu
- Pawan Kalyan
- TDP Janasena BJP Alliance
- YS Jaganmohan Reddy
- YSR Congress Party