
Madiga Corporation Chairman Undavalli Sridevi Pressmeet
దేశంలోనే అత్యుత్తమ రాజధాని అమరావతి కాబోతోందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. "అమరావతి పున:నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మించబోతున్నాం. ఇందుకు చంద్రబాబు ప్రతిష్ట, కష్టం చాలా ఉంది. ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల కృషి కూడా ఎనలేనిది. అమరావతి పున:నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమరావతికి పూర్వ వైభవం వచ్చినట్లైంది. సభా ప్రాంగణం ‘జైహో అమరావతి, జై జై అమరావతి’ అనే నినాదాలతో మార్మోగింది. ప్రజలు హోరెత్తించారు. ప్రధాని మోడీ 74 పనులకు శంఖుస్థాపనలు చేయడం సంతోషదాయకం. 49 వేల కోట్లతో శంఖుస్థాపనలు చేయడం హర్షదాయకం. అమరావతి పున: నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ మద్దతును అందిస్తోంది. ఇంద్రలోక రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాలు రాష్ట్ర అభివృద్దికి, వికసిత భారత్ కు బలమైన పునాదులు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలిసి ఈ పనులు చేయాలి, మనమే చేయాలి అని మోడీ గట్టి నినాదం ఇచ్చారు. రాజధాని పనులు ప్రారంభమైనప్పటి నుంచి జగన్, జగన్ ముఠా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది. ‘వేదనలో రాజ్యం-వేడుకలో రాజధాని’ అని అవినీతి పత్రిక సాక్షిలో రాశారు. అశేష జనవాహిని తరలివచ్చి వేడుకగా రాజధాని పున:ప్రారంభమైతే రాజ్యం వేదనలో ఉన్నట్లు ఎలా అవుతుంది? వేడుకగా జరుపుకున్నట్లే. వైసీపీ హయాంలో కేసులు, ధన ప్రాణ నష్టాలు జరిగాయి. ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం గడిపారు. తాను మాట తప్పును, మడమ తిప్పను, విశ్వసనీయతకు, విలువలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగన్ చెప్పిన మాటలు అసెంబ్లీ రికార్డులు తిరగేస్తే తెలుస్తాయి. అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పి మాట తప్పి, మడమ తిప్పాడు. ప్రజల్ని మభ్య పెట్టారు. సాక్షి పత్రికలో ఉన్నదాన్ని వక్రీకరించి రాస్తున్నారు" అని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.