జే ట్యాక్స్ వసూలుకాకపోతే జేసీబీలు రంగంలోకి..: ఆత్మకూరు కూల్చివేతలపై నారా లోకేష్
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో నిరుపేదలకు చెందిన 120 ఇళ్ల కూల్చివేత దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో నిరుపేదలకు చెందిన 120 ఇళ్ల కూల్చివేత దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కూల్చివేత సమాచారం తెలిసిన వెంటనే ఆయన టిడిపి నియోజకవర్గ నేతలతో మాట్లాడి బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. జగన్రెడ్డి పాలనలో జే ట్యాక్స్ వసూలు కాకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకొచ్చి రెండేళ్లయినా పేదలకు ఒక ఇల్లు కూడా కట్టలేని సర్కారుకి నిరుపేదల ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారు? అని లోకేష్ ప్రశ్నించారు. ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్ల నుంచి రేకుల షెడ్డులు వేసుకుని జీవిస్తున్న 120 నిరుపేద కుటుంబాలను నడిరోడ్డున పడేయడం న్యాయమా అని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ పేరుతో స్థానిక ఎమ్మెల్యే తన సామాజికవర్గం వారికి ప్రయోజనాల కోసం నిరుపేదల గూడు కూలగొట్టారని అనుమానించాల్సి వస్తోందన్నారు.