సత్యసాయి జిల్లాలో ఘోరం... పొట్టకూటికోసం వెళుతూ 8మంది కూలీలు సజీవదహనం
ధర్మవరం: కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీలుగా మారిన కొందరు ఇవాళ (గురువారం) తెల్లవారుజామునే ఘోర ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయారు.
ధర్మవరం: కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీలుగా మారిన కొందరు ఇవాళ (గురువారం) తెల్లవారుజామునే ఘోర ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తాడిమర్రి మండలం పెద్దకొట్టాల పంచాయితీ గుడ్డంపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ఉదయమే పనులకోసం షేరింగ్ ఆటోలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో చిల్లకొండాయపల్లి వద్దకు రాగానే హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకింది. దీంతో మొదట కరెంట్ షాక్, ఆతర్వాత ఆటోకు మంటలు అంటుకోవడంతో తప్పించుకునే మార్గమే లేకపోవడంతో కూలీలంతా సజీవదహనం అయ్యారు. మంటల్లో కాలిపోతున్న మృతదేహాలు, ఆటోతో ఘటనాస్థలంలో భయానక వాతావరణం నెలకొంది.