రేవంత్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు
రాష్ట్ర రాజకీయాలన్నీ కేటీఆర్, రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. కేటీఆర్కు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్తో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. ఈ రెండు నేతల మధ్య మాటల యుద్ధం రెండు పార్టీల మధ్య ఘర్షణలుగా పరిణమించాయి. కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించడం, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో కొన్నాళ్లుగా టాలీవుడ్ డ్రగ్స్కు సంబంధించిన కేసు చర్చనీయాంశమైంది. ఇప్పుడు కొత్తగా ఇదే డ్రగ్స్పై పొలిటికల్ వార్ మొదలైంది. కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వైట్ చాలెంజ్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నది. కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య వాగ్యుద్ధం టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పోరాటంగా రూపం మార్చుకుంటున్నది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి వెళ్లేలా కనిపిస్తున్నాయి. కేటీఆర్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి.
తాము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్లామని, కానీ, వాళ్లే తమపై దాడి చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు తమవైపు వివరాలను పేర్కొంటున్నారు. పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేటీఆర్పై డ్రగ్స్ చాలెంజ్ విసరడం తీవ్రపరిణామంగా మారింది. అంతేకాదు, కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి ఇతర కార్యక్రమాలూ చేశారు. గన్పార్క్ దగ్గర నిరసనకు దిగారు. అనంతరం టీఆర్ఎస్ యువజన విభాగం వెంటనే అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.