బిడ్డా రేవంత్ జాగ్రత్త... పిచ్చికూతలు మానకుంటే బట్టలూడదీసి కొడతాం : బాల్క సుమన్ వార్నింగ్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి విప్ బాల్క సుమన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హుజురాబాద్: తెలంగాణ పిసిసి(TPCC) అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎదుర్కొంటున్న మొట్టమెదటి ఎన్నిక హుజురాబాద్ నియోజకవర్గంలో(Huzurabad Bypoll) జరగనుందని టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అన్నారు. దమ్ముంటే ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్ కు సుమన్ సవాల్ విసిరారు.
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ పరిధిలో ప్రభుత్వ విప్ సుమన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డితో పాటు బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో అక్కడక్కడ సభలు నిర్వహించి హడావుడి చేస్తున్న రేవంత్ హుజురాబాద్ ఉపఎన్నిక గురించి ఎందుకు మాట్లాడటం లేదని సుమన్ నిలదీశారు. బిజెపి, ఈటల రాజేందర్ తో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.
''బిడ్డా రేవంత్... తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొని పోలీస్ దెబ్బలు తిన్నావా? స్వరాష్ట్రం కోసం ఏనాడైనా జైలుకు పోయావా? పదవులకు రాజీనామా చేశావా? అలాంటి నువ్వు ఇప్పుడు కేవలం అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. మరోసారి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న మంత్రి కేటీఆర్పై పిచ్చికూతలు మానుకోకపోతే బట్టలూడదీసి కొడతాం'' అని సుమన్ హెచ్చరించారు.
''రేవంత్ దేశ రాజధాని డిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడో మొత్తం తెలుసు. ఆ చిట్టాను బయటపెడితే ఆయనకు భార్య కూడా తిండి పెట్టదు. ఆ పరిస్థితి తెచ్చుకోకు'' అంటూ రేవంత్ ను బాల్క సుమన్ హెచ్చరించారు.
ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. అందువల్లే టీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం చేసుకున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారంలో వున్న టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని సుమన్ సూచించారు.