ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని లేకుంటే పీయూష్ గోయల్ను నిలదీసేవాళ్లమని రేవంత్ స్పష్టం చేశారు.
రైతుల ప్రయోజనాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని ఫైరయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ ఆరోపించారు. సీఎం లేఖ రాయకపోతే.. పీయూష్ గోయల్ (piyush goyal) చొక్కా పట్టుకుని అడిగేవాళ్లమని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న విద్యుత్, పెట్రోల్ ధరలకు నిరసనగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎల్లుండి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 7న విద్యుత్ సౌధ ముట్టిస్తామని.. బషీర్బాగ్ తరహాలో ఉద్యమాలకు సిద్ధం కావాలని శ్రేణులకు టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాళ్లతో కొట్టాలని ఆయన కోరారు.
యూపీఏ హయాంలో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం భరించిందని రేవంత్ గుర్తుచేశారు. రూ.50కి వస్తున్న పెట్రోల్పై కేసీఆర్ రూ.35, మోడీ రూ.30 పన్ను వేస్తున్నారంటూ దుయ్యబట్టారు. 8 ఏళ్లలో పన్నుల రూపంలో రూ.36 లక్షల కోట్లను కేంద్రం దోచుకుందని రేవంత్ ఆరోపించారు. పారాబాయిల్డ్ రైస్ పంపమని 2021లో ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసిందని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందమే తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని.. ఒప్పందం కుదుర్చుకోకపోతే పీయూష్ గోయల్ను నిలదీసేవాళ్లమని రేవంత్ అన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాళ్లతో కొట్టాలన్నారు. గవర్నర్ వ్యవస్థను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇకపోతే.. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం ఆందోళనకర స్థాయిలో వుందని సీఎం కేసీఆర్కు (kcr) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై జాతీయస్థాయిలో సిట్ (sit) ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంగా కేసీఆరే ఆయా సంస్థలకు లేఖ రాయాలని రేవంత్ కోరారు. సిట్ ఏర్పాటు కోసం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయాలని కోరారు. హైదరాబాద్లో డ్రగ్స్తో యువకుడి మృతితోనైనా కేసీఆర్లో మార్పు రావాలని ఆకాంక్షించారు.
తక్షణమే డ్రగ్స్కు సంబంధించి డిజిటల్ రికార్డులను ఈడీకి అందజేయాలని కోరారు. మీ కుటుంబ సభ్యులను కాపాడటానికి సమాజానికి నష్టం చేయకండని లేఖలో పేర్కొన్నారు. పిల్లలు చచ్చిపోతున్నా మీరు స్పందించకుంటే మీ మానసిక పరిస్ధితిపై అనుమానం కలిగే పరిస్థతి వస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరింత మంది పిల్లలు బలికాకముందే సీఎం కేసీఆర్ స్పందించాలని బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. లేనిపక్షంలో డ్రగ్స్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని తొలి దోషిగా భావించాల్సి వుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా.. హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణ డ్రగ్స్కి అడ్డాగా మారిందని.. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం , విష నగరంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారని.. హైదరాబాద్ను ఐటీ హబ్ చేసింది కాంగ్రెస్సేనని మధుయాష్కీ అన్నారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ డ్రగ్స్కి కేపిటల్ సిటీగా మారిందని ఆరోపించారు మధుయాష్కీ. తాను విద్యార్ధిగా వున్నప్పుడు ముంబై, ఢిల్లీలలో డ్రగ్స్ గురించి వినేవారమని.. హైదరాబాద్లో ఎప్పుడూ వినలేదన్నారు. ఒక యువకుడు డ్రగ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడని మధుయాష్కీ ఆవేదన వ్యక్తం చేశారు.
