టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ మంగళవారం నాడు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పూరీ జగన్నాథ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు.
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ మంగళవారం నాడు ఈడీ విచారణకు హాజరయ్యారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ విచారిస్తోంది. డ్రగ్స్ కోసం విదేశాలకు పెద్ద ఎత్తున నిధులను తరలించినట్టుగా ఈడీ గుర్తించింది. ఈ కేసులో గతంలో విచారణను ఎదుర్కొన్నవారితో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.
ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 22 వరకు ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులను విచారించనున్నారు.విదేశాలకు ఎలా నిధులను తరలించారనే విషయమై ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు.ఈ కేసును విచారించిన సిట్ అధికారి సోమవారం నాడు ఈడీ అధికారులతో భేటీ అయ్యారు. విచారణ నివేదికను ఈడీకి సమర్పించారు.
ఎక్సైజ్ శాఖ విచారించిన 50 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు.
డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారు. విదేశాలకు నిధులను ఎలా తరలించారనే విషయంపై ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించిన పెడర్స్ కెల్విన్, విక్టర్, కమింగాల స్టేట్మెంట్ సేకరించారు. విదేశీ బ్యాంకులకు ఎంత డబ్బు అక్రమంగా తరలిందనే విషయమై ఆరా తీస్తోంది. దీని కోసం ఇంటర్ పోల్ సాయం తీసుకొనే అవకాశం ఉంది..
2015-2021 వరకు బ్యాంకు ఖాతా వివరాలను పూరీ జగన్నాథ్ ఈడీ అధికారులకు ఇచ్చారు. తనకు ఉన్న మూడు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ ను ఈడీ అధికారులకు పూరీ జగన్నాథ్ అందించారు.కొడుకు, తన చార్టెట్ అకౌంటెంట్ లు వెంట రాగా పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
సెప్టెంబర్ 2న నటి చార్మీ, సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 8న మరో స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న మరో హీరో రవితేజా, అతని డ్రైవర్ శ్రీనివాస్ను ఈడీ ప్రశ్నించనుంది. సెప్టెంబర్ 13వ తేదీన నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఈడీ ముందు హాజరవుతారు. సెప్టెంబర్ 15వ తేదీనా ముమైఖాన్, సెప్టెంబర్ 17వ తేదీన నటుడు తనీష్, సెప్టెంబర్ 20న హీరో నందు, సెప్టెంబర్ 22న హీరో తరుణ్ను ఈడీ విచారించనుంది.